అమెజాన్‌ను దెబ్బతీయడం కోసం మరో దిగ్గజం

5 May, 2018 12:46 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌లు మెగా డీల్‌ను కుదుర్చుకోగా, మరో దిగ్గజ కంపెనీ కూడా అమెజాన్‌ను దెబ్బతీయడానికి భారత ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి అరంగేట్రం చేయబోతోంది. వాట్సాప్‌ ద్వారా ఇప్పటికే దేశీయ పేమెంట్‌ సర్వీసుల్లోకి ప్రవేశించిన ఫేస్‌బుక్‌, త్వరలోనే ఈ-కామర్స్‌ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ పలు బ్రాండులు, వ్యాపారస్తులతో చర్చలు జరుపుతుందని తెలిపాయి. జూన్‌ నుంచి ప్రారంభించబోతున్న బిజినెస్‌-టూ-కన్జ్యూమర్‌ ట్రాన్సక్షన్స్‌ టెస్టింగ్‌ ఈ నెల నుంచే మొదలైనట్టు ఒకరు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ తన మార్కెట్‌ప్లేస్‌లో ఉత్పత్తులను అప్‌లోడ్‌ చేయడం కోసం మరిన్ని టూల్స్‌ను ఏర్పాటు చేయనుందని,  ఇన్వెంటరీ, ఆర్డర్లను నిర్వహించనుందని తెలిపారు. 

ఈ ఏడాది చివరి వరకు పేమెంట్స్‌ను కూడా జత చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, తన వినియోగదారులను అమ్మకపుదారుల ఫేస్‌బుక్‌ పేజీలకు, వెబ్‌సైట్లకు మరలుస్తోంది.  ఫేస్‌బుక్‌ గత ఆరు నెలల క్రితమే కన్జ్యూమర్‌-టూ-కన్జ్యూమర్‌ ఇంటర్‌ఫేస్‌ కోసం మార్కెట్‌ ప్లేస్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి నెల ఈ మార్కెట్‌ప్లేస్‌ను 70 దేశాల్లో 800 మిలియన్‌ మంది యూజర్లు సందర్శిస్తూ కొనుగోళ్లు, అమ్మకాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ సోషల్‌మీడియా దిగ్గజం బిజినెస్‌-టూ-కన్జ్యూమర్‌ మోడల్‌ను లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తోంది.  దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌ 2026 వరకు 200 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని మోర్గాన్‌ స్లాన్లీ అంచనావేస్తోంది. ప్రజల అవసరాలను చేరుకోవడానికి కంపెనీ ఎల్లవేళలా కృషిచేస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈకామర్స్‌ ద్వారా కమ్యూనిటీస్‌ కనెక్ట్‌ కావడం కోసం కొత్త మార్గాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూనే ఉంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు