ఫేస్‌బుక్‌ మరో ఆవిష్కారం 

26 Oct, 2019 19:57 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రముఖ సోషల్ మీడియా  దిగ్గజం ఫేస్‌బుక్‌ మరోకొత్త  ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఫేస్‌బుక్‌ యాప్‌లో ప్రత్యేక వార్తా విభాగాన్ని ప్రవేశపెట్టింది. 'న్యూస్ ట్యాబ్' పేరుతో సరికొత్త ఫీచరును అందుబాటులోకి తెచ్చింది. తద్వారా తన ప్లాట్‌ఫాంలో ఫేక్‌న్యూస్‌కు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. కొంతకాలంగా ప్రయోగదశలో పరిశీలించిన ఈ ఫీచర్‌ను శుక్రవారం అమెరికాలో మాత్రమే అందుబాటుకి తెచ్చింది. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ ఫీచర్‌ను త్వరలోనే  అందుబాటులోకి తేనుంది. న్యూయార్క్‌లో పాలే సెంటర్ ఫర్ మీడియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ మాట్టాడుతూ, తొలిసారిగా తమ యాప్‌లో ప్రదర్శించే వార్తలకుగాను పబ్లిషింగ్ కంపెనీలకు కొంత సొమ్మును చెల్లించనున్నామని తెలిపారు.  అయిత ఫేస్‌బుక్‌లో తమ వార్తలకోసం ఆయా పబ్లిషర్లు  యాప్‌ లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి వుంటుందని పేర్కొన్నారు.

ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ, జనరల్‌ న్యూస్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన వార్తలు ఫేస్‌బుక్ యూజర్లకు అందుబాటులో వుంటాయి. ప్రధానంగా వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఎన్‌బీసీ న్యూస్ , ఏబీసీ న్యూస్ తోపాటు, చికాగో ట్రిబ్యూన్ డల్లాస్ మార్నింగ్ న్యూస్ స్థానిక అవుట్లెట్లతో సహా సుమారు 200 మంది ప్రచురణకర్తల వార్తలు, విశేషాలు ఫేస్‌బుక్‌లో  చదువు కోవచ్చు. ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి, అసలైన రిపోర్టింగ్ ప్రాముఖ్యతను గుర్తించడానికి చాలా కష్టపడ్డామని ఫేస్‌బుక్‌ వార్తా భాగస్వామ్యాన్ని పర్యవేక్షించే కాంప్‌బెల్ బ్రౌన్ చెప్పారు. ఫేస్‌బుక్‌ వినియోగదారుడు ఎవరైనా సరే సంబంధిత వార్తను చదవాలంటే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.  దీంతో ఫేస్‌బుక్ నుంచి లింక్ నేరుగా పబ్లికేషన్ కు రీ-డైరెక్ట్ అవుతుంది. పాత్రికేయ వృత్తికి మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇస్తున్న గౌరవం గొప్పదని ఇప్పటికే పలు వార్తా పత్రికల అధినేతలు  జుకర్‌బర్గ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు