బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నవారిని అన్‌బ్లాక్‌ చేసేసింది

3 Jul, 2018 11:37 IST|Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఇటీవల తీవ్రంగా డేటా స్కాండల్‌ ఆరోపణలు ఎదుర్కొంటోంది. డేటా స్కాండల్‌తో పాటు, కొన్ని సాఫ్ట్‌వేర్‌ బగ్స్‌ కూడా ఫేస్‌బుక్‌కు కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. తాజాగా మరో సాఫ్ట్‌వేర్‌ బగ్‌ వెలుగులోకి వచ్చింది. 8 లక్షల మందికి పైగా యూజర్లు ఈ బగ్‌ బారిన పడ్డారని, ఈ బగ్‌ యూజర్లు బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న వారిని, అన్‌బ్లాక్‌ చేస్తుందని తెలిసింది.  దీని బారిన పడిన వారిలో ఫేస్‌బుక్‌ యాప్‌ యూజర్లు, మెసేంజర్‌ యాప్‌ యూజర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ఈ బగ్‌ యాక్టివ్‌లో ఉందని ఫేస్‌బుక్‌ ధృవీకరించింది. ఎవరినైనా బ్లాక్‌లో పెట్టే సామర్థ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదని ఫేస్‌బుక్‌ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ ఎరిన్‌ ఇగాన్‌ చెప్పారు. 

బ్లాక్‌ చేసిన వారి ప్రొఫైల్‌ చూడకుండా ఉండే సౌకర్యాన్ని ఫేస్‌బుక్‌ కల్పిస్తోంది. ఒక ఫ్రెండ్‌గా కనెక్ట్‌ అయిన తర్వాత, వారి ప్రవర్తన నచ్చకపోతే వారిని ఆటోమేటిక్‌గా ‘అన్‌ఫ్రెండ్స్‌’ లో పెట్టేయొచ్చు.  ఒక యూజర్‌ను మరో ఫేస్‌బుక్‌ యూజర్‌ బ్లాక్‌లో పెట్టడానికి చాలా కారణాలుంటాయని ఇగాన్‌ తెలిపారు. వారి మధ్య సంబంధాలు తెగిపోవడం లేదా నచ్చని కంటెంట్‌ను వారు పోస్టు చేస్తూ ఉండటం ఇలాంటి పలు కారణాలతో ఫేస్‌బుక్‌ యూజర్లను బ్లాక్‌ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. వేధింపుల కారణంతో కూడా కొంతమంది యూజర్లను బ్లాక్‌ చేస్తుంటారని తెలిపింది. 8 లక్షల మందికి పైగా యూజర్లు దీని బారిన పడ్డారని, ఈ బగ్‌ ప్రభావితమైన యూజర్లకు నోటిఫికేషన్లు వస్తాయని కంపెనీ తెలిపింది. నోటిఫికేషన్‌ వచ్చిన అనంతరం బ్లాక్డ్‌ జాబితాను యూజర్లు ఒక సారి చెక్‌ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే తన సంస్థకు, డేటా షేర్‌ చేసిన స్కాండల్‌లో ఫేస్‌బుక్‌ భారీ ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. 

మరిన్ని వార్తలు