కొనుగోళ్ల హుషారుకు చివరి గంటలో చెక్
లాభాల నుంచి నష్టాల్లోకి మళ్లిన మార్కెట్
46 పాయింట్లు డౌన్- 34,916కు సెన్సెక్స్
పీఎస్యూ బ్యాంక్స్- ఫార్మా, మీడియా బోర్లా
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో వెనకడుగు వేశాయి. కొనుగోళ్లకు చెక్ పడగా అమ్మకాలు పెరగడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 46 పాయింట్లు క్షీణించి 34,916 వద్ద నిలవగా.. నిఫ్టీ నామమాత్రంగా 10 పాయింట్లు నీరసించి 10,302 వద్ద స్థిరపడింది. అయితే తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో 35,168 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 35,234 వరకూ ఎగసింది. తదుపరి చివర్లో తోకముడిచి 34,813 దిగువకూ జారింది. ఇక నిఫ్టీ సైతం 10401- 10267 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.
ఆటో జోరు
ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, ఫార్మా రంగాలు 1.7 శాతం చొప్పున డీలాపడగా.. రియల్టీ 0.5 శాతం నష్టపోయింది. ఆటో 1 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్, పవర్గ్రిడ్, సన్ ఫార్మా, గెయిల్, ఐవోసీ, వేదాంతా, కోల్ ఇండియా, ఎయిర్టెల్, యూపీఎల్, ఓఎన్జీసీ 2.5-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే శ్రీ సిమెంట్, మారుతీ, ఐసీఐసీఐ, నెస్లే, బ్రిటానియా, అల్ట్రాటెక్, టాటా స్టీల్, హీరో మోటో, ఐషర్, హెచ్డీఎఫ్సీ 3-1.2 శాతం మధ్య ఎగశాయి.
ఐడియా వీక్
డెరివేటివ్స్లో ఐడియా, గ్లెన్మార్క్, ఐబీ హౌసింగ్, కేడిలా హెల్త్, హెచ్పీసీఎల్, ఆర్బీఎల్ బ్యాంక్, అశోక్ లేలాండ్, పీఎఫ్సీ, టొరంట్ ఫార్మా, ఈక్విటాస్ 4.5-3 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు జిందాల్ స్టీల్, మ్యాక్స్ ఫైనాన్స్, బాష్, ఏసీసీ, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ ప్రు, సెయిల్, యూబీఎల్, ఎంఆర్ఎఫ్ 5.5-3 శాతం మధ్య జంప్చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.15-0.7 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1474 నష్టపోగా.. 1288 లాభపడ్డాయి.
డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) 1937 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1036 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. శుక్రవారం ఎఫ్పీఐలు రూ. 753 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1304 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.