ఆన్‌లైన్‌లో విజృంభిస్తున్న నకిలీ దందా!

27 Dec, 2017 22:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్లు, 4జీ వినియోగం పెరగడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్‌లో అమ్మేవాటిలో చాలా వరకు నకిలీ ఉత్పత్తులు ఉన్నట్టు వెల్లడయింది. సాధారణంగా పండుగ సమయంలో ఈ–కామర్స్‌ వెబ్‌సైట్లు డిస్కౌంట్లతో హోరెత్తిస్తుంటాయి.  రాయితీలు ఇచ్చి అమ్మే వస్తువుల్లో ఎన్ని మంచివి? ఎన్ని నకిలీవి? అనే విషయమై ఓ ఆంగ్ల ఛానల్‌ జరిపిన పరిశోధనలో విస్తపోయే వాస్తవాలు తెలిశాయి. చాలామంది తయారీదారులు, విక్రేతలు ఆన్‌లైన్‌లో నకిలీ సరుకులను అంటగడుతున్నట్టు తేలింది. ఐటీ చట్టంలోని లోపాలను వాడుకుంటూ ఇలా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న దాదాపు 60 శాతం క్రీడా ఉత్పత్తులు నకిలీవేనట. అంతేకాక 40 శాతం దుస్తులు నకిలీ కంపెనీలవేనని గుర్తించారు.

ఉత్తరప్రదేశ్‌ కు చెందిన మీరట్‌లోని బ్రహ్మపురి ఏరియాలో పోలీసులు జరిపిన తనిఖీలో పెద్ద మొత్తంలో పట్టుబడిన నకిలీ ఉత్పత్తులను సీజ్‌ చేశారు. వీటిని ఫ్లిప్‌కార్ట్, షాప్‌క్లూస్, స్నాప్‌డీల్‌ వంటి ప్రముఖసైట్లలో విక్రయిస్తున్నారు. రూ.170–200 వరకు ధర ఉన్న నకిలీ ఉత్పత్తులను రూ.450–500కు అమ్ముతున్నారు.  ఏకంగా 50–60 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారు. మనీలాండరింగ్‌కు, కొన్ని రకాల మోసాలకు కూడా కంపెనీలు ఆన్‌లైన్‌ను వాడుకుంటున్నట్టు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.   

మరిన్ని వార్తలు