ఈ రంగం పురోభివృద్ధికి
దోహదపడుతుందన్న విశ్వాసం
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితి పెంపు ఈ పరిశ్రమ పురోభివృద్ధికి దోహదపడుతుందని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) చైర్మన్ టీఎస్ విజయన్ గురువారం పేర్కొన్నారు. ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు రావడానికి ఈ నిర్ణయం వీలు కల్పిస్తుందని అన్నారు.ఆరోగ్య బీమాపై ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఎఫ్డీఐ నిబంధనల సరళీకరణ నేపథ్యంలో... కొన్ని విదేశీ కంపెనీలు ఇటీవల తమ భారత జాయింట్ వెంచర్లలో తమతమ వాటాలను 26% నుంచి 49%కి పెంచుకున్నాయి. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో నిప్పన్, భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్లో ఆక్సా, మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్లో బుపా, బిర్లా సన్లైఫ్లో సన్లైఫ్ ఫైనాన్షియల్ సంస్థలు ఈ కోవలో ప్రముఖమైనవి. ఆరోగ్య బీమా పట్ల భారత్లో ఇంకా చైతన్యం పెరగాల్సి ఉందని విజయన్ అన్నారు. అలాగే పాలసీల రేట్లు భరించగలిగే స్థాయిలోనూ ఉండాలని స్పష్టంచేశారు.