‘ఇక ఆన్‌లైన్‌లో పెట్రోల్‌’

13 Oct, 2017 16:53 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:డిజిటల్‌ విప్లవం ప్రపంచాన్ని చుట్టేయడంతో అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ సహా పెట్రో ఉత్పత్తులను ఈ-కామర్స్‌ వేదికపై విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటి సాధ్యాసాధ్యాలపై కసరత్తు సాగిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాంపైకి తీసుకువస్తామని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.అయితే దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పెట్రో ఉత్పత్తుల విక్రయం అసాధ్యమేమీ కాకున్నా ఈ విషయంలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటించాలని ఈ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు సూచిస్తున్నారు.

ఈ-కామర్స్‌ సైట్లలో పెట్రోల్‌ను ఆఫర్‌ చేసి ఆ తర్వాత కస్టమర్ల తలుపు తట్టి డెలివరీ చేయడం సాంకేతికంగా సాధ్యమేనని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన ఆలోచనను ఇటీవల పార్లమెంటరీ సలహా సంఘం ఎదుట పంచుకున్నారు. అయితే పెట్రో ఉత్పత్తులను సరిగ్గా సీల్‌ చేయడం, సున్నితంగా వాటిని హ్యాండిల్‌ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉందని చమురు, సహజవాయు వ్యవహారాలను పర్యవేక్షించే దీపక్‌ మహుర్కార్‌ చెబుతున్నారు. ఇది కార్యరూపం దాల్చే ప్రతిపాదనేనని, భద్రతాపరంగా గట్టి చర్యలు చేపట్టాలని ఓఎన్‌జీసీ మాజీ సీఎండీ ఆర్‌ఎస్‌ శర్మ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు