న్యూఢిల్లీ: వచ్చే నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వివిధ ఆర్థిక నియంత్రణ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో బడ్జెట్ సంబంధ ప్రతిపాదనలపై సమాలోచనలు జరిపారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చైర్మన్ అజయ్ త్యాగి, బీమా రంగ నియంత్రణ అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ చీఫ్ సుభాష్ చంద్ర ఖుంతియా తదితరులు దీనికి హాజరయ్యారు. 2018–19లో దేశ వృద్ధి రేటు 6.8 శాతానికి క్షీణించిన పరిస్థితుల నడుమ రెండో విడత ఎన్నికైన మోదీ ప్రభుత్వం జూలై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకుంది.