బడ్జెట్‌లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం

8 Feb, 2020 05:37 IST|Sakshi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబై: తాజాగా తాను సమర్పించిన బడ్జెట్‌లో వివేకంతో, జాగ్రత్తతో కూడిన ప్రోత్సాహక చర్యలను ప్రకటించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలో పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘దశాబ్ద కనిష్టానికి వృద్ధి రేటు క్షీణించిన సమయంలో కొన్ని నియోజకవర్గాలు బడ్జెట్‌లో భారీ ప్రకటనలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు గుర్తించాం. గతంలో ప్రోత్సాహకాలకు సంబంధించిన అనుభవం ఆధారంగా మేము.. తగినంత జాగ్రత్తతో, వివేకంతోనే బడ్జెట్‌లో వ్యవహరించాం. స్థూల ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుని.. వినియోగం పెంచేందుకు, దీర్ఘకాలం పాటు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఆస్తుల కల్పనకు తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం’’ అని సీతారామన్‌ వివరించారు.

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై పని జరుగుతోంది..
వివాదాస్పద ఫైనాన్షియల్‌ రిజల్యూషన్స్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లుపై ఆర్థిక శాఖా పని కొనసాగిస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ముందుకు తిరిగి ఎప్పుడు వస్తుందన్నది స్పష్టంగా చెప్పలేనన్నారు. సంక్షోభంలో ఉన్న బ్యాంకులను ఒడ్డెక్కించేందుకు డిపాజిటర్ల డబ్బులను కూడా వినియోగించుకోవచ్చన్న వివాదాస్పద క్లాజులు బిల్లులో ఉండడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడం వల్ల గతంలో ఈ బిల్లును సభ నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 

మరిన్ని వార్తలు