ఎల్‌అండ్‌టీలో ఆర్థిక అవకతవకలు..! 

6 Apr, 2018 01:08 IST|Sakshi

ఎస్‌ఎఫ్‌ఐవోకి ఎంపీ పర్వీన్‌ ఫిర్యాదు 

ఆరోపణలు ఖండించిన కంపెనీ 

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ రాజ్యసభ ఎంపీ కెహ్‌కషాన్‌ పర్వీన్‌ ఆరోపించారు. ఈ మేరకు సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో)కి ఫిర్యాదు చేశారు. రహదారి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రూప్‌ తీసుకున్న రూ. 8,000 కోట్ల పైగా రుణాలు .. మొండిబాకీలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎల్‌అండ్‌టీ హలోల్‌ షామ్‌లాజీ టోల్‌వే (ఎల్‌అండ్‌టీ హలోల్‌), ఎల్‌అండ్‌టీ చెన్నై తడ ప్రాజెక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఎస్‌ఎఫ్‌ఐవో ముంబై ప్రాంతీయ కార్యాలయానికి చెసిన ఫిర్యాదులో పర్వీన్‌ ఆరోపించారు.

ఇది విచారణార్హమైనదిగా పేర్కొంటూ సదరు ఫిర్యాదు గురించి ప్రధాన కార్యాలయానికి ముంబై కార్యాలయం తెలియజేసింది.   మరోవైపు, ఎల్‌అండ్‌టీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. విచారణ గురించి తమకేమీ సమాచారం రాలేదని పేర్కొంది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో తాము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని  ఎల్‌అండ్‌టీ వివరించింది.    

మరిన్ని వార్తలు