ఆర్థిక ఫలితాలే దిక్సూచి

26 Apr, 2017 02:03 IST|Sakshi
ఆర్థిక ఫలితాలే దిక్సూచి

ఫలితాలు బాగుంటే మార్కెట్లు ఇంకా పెరుగుతాయి
కానీ క్యూ4లో డీమోనిటైజేషన్‌ ప్రభావం ఉండొచ్చు
మార్కెట్లపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోంది
బ్యాంకింగ్, నిర్మాణ రంగాలు ఆశావహంగా ఉన్నాయి
సాక్షి’తో యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఈవీపీ సంజయ్‌ డోంగ్రే


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డీమోనిటైజేషన్‌ ప్రభావాలు నాలుగో త్రైమాసికంలోనే పూర్తి స్థాయిలో ప్రతిఫలించనున్న నేపథ్యంలో క్యూ4లో ఆదాయాలపరంగా చూస్తే కంపెనీల ఆర్థిక ఫలితాలు ఒక మోస్తరుగానే ఉండొచ్చని తెలిపారు యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ డోంగ్రే. ద్విచక్ర వాహనాలు, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్‌ రంగాలపై పెద్ద నోట్ల రద్దు గణనీయంగా పడిందని చెప్పారాయన. ఐఐపీ తగ్గుదల తదితర గణాంకాలు డీమోనిటైజేషన్‌ ప్రభావాలను కొంత ప్రతిబింబించేవిగా ఉన్నాయని, అయితే రీమోనిటైజేషన్‌ జరిగే కొద్దీ ప్రతికూల ప్రభావాలు క్రమంగా తొలగిపోయి పరిస్థితులు మెరుగుపడగలవని సంజయ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ల దిశానిర్దేశానికి ఆర్థిక ఫలితాలే కీలకంగా ఉండగలవని ఆయన వివరించారు. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని,  కార్పొరేట్ల ఫలితాలు మెరుగ్గా ఉంటే.. మరింత పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఇన్‌ఫ్రా... బ్యాంకింగ్‌..
ప్రైవేట్‌ రంగ స్థితిగతుల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక రంగంలో పెట్టుబడులు ఎక్కువగా ప్రభుత్వం నుంచే రావాల్సి ఉంటుందని సంజయ్‌ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్ప నకు తోడ్పడేలా వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం ఈ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటోందన్నారు. ఇక బ్యాంకింగ్‌ రంగం విషయానికొస్తే అధిక మొండిబకాయిల రూపంలో అసెట్‌ క్వాలిటీ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయన్నారు.

అయితే కార్పొరేట్లకు ఎక్కువగా రుణాలిచ్చిన బ్యాంకులతో పోలిస్తే రిటైల్‌ రుణాలపై దృష్టి పెట్టిన బ్యాంకుల పరిస్థితి మెరుగ్గానే ఉండగలదన్నారు. రుణాల మంజూరీ వృద్ధి తక్కువగానే ఉండటంతో.. లాభాలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయని, ఎకానమీ మెరుగుపడే కొద్దీ వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో ఎన్‌పీఏలు కూడా తగ్గు ముఖం పట్టి కార్పొరేట్లకు రుణాలిచ్చిన బ్యాంకులు కూడా కొంత మెరుగైన ఆర్థిక ఫలితాలే ప్రకటించే అవకాశం ఉందని వివరించారు.

పెరుగుతున్న దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ..
దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లలో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నారని సంజయ్‌ చెప్పారు. రియల్టీ తదితర రంగాల పరిస్థితి ఆశావహంగా లేకపోవడంతో గడిచిన రెండు మూడేళ్లలో మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ల తీరుతెన్నులు, వాటి హెచ్చుతగ్గుల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోందని, దీంతో ఈక్విటీలకు అధిక కేటాయింపులు జరుపుతున్నారని వెల్లడించారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు వచ్చే కొద్దీ మార్కెట్లలో కొంత చెప్పుకోతగ్గ కదలికలు ఉంటాయన్నారు.

 ప్రస్తుతం మార్కెట్ల వేల్యుయేషన్స్‌ మరీ ఖరీదైనవిగా గానీ లేదా మరీ చౌకైనవిగా గానీ అనుకోవడానికి లేదని సంజయ్‌ చెప్పారు. మొత్తం లాభాల్లో డిఫెన్సివ్‌ రంగాలతో పోలిస్తే సీజనల్‌ రంగాల వాటా ఎక్కువగా ఉంటోందన్నారు.  రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, సిమెంటు, నిర్మాణం మొదలైన సీజనల్‌ రంగాల సంస్థలు మెరుగ్గా ఉండొచ్చని సంజయ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు