ఇక పదేళ్లే మిగిలింది

14 Jun, 2018 00:52 IST|Sakshi

‘అభివృద్ధి చెందిన’ స్థాయికి డెడ్‌లైన్‌ అది

పెరిగిన జనాభా... విద్యపై దృష్టి పెట్టాలి

లేదంటే జనాభాయే ప్రతిబంధకం: ఎస్‌బీఐ

ముంబై: భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందేందుకు కేవలం పదేళ్ల కాలమే ఉందని, ఇందుకోసం అంతా విద్యపై దృష్టి సారించాలని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది. లేకపోతే అధిక జనాభాయే ప్రతికూలమవుతుందని హెచ్చరించింది. ‘‘భారత్‌ అభివృద్ధి చెందిన దేశం అనే ట్యాగ్‌ను సొంతం చేసుకోవటానికింకా దశాబ్ద కాలమే మిగిలి ఉంది. దీన్ని సాధించలేకపోతే ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. విధాన నిర్ణేతలు మేల్కోవాలి’’ అని ఎస్‌బీఐ పరిశోధక బృందం రూపొందించిన అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. ఇంకా ఈ నివేదిక ఏం సూచించిందంటే...

►యువ జనాభాపై ప్రభుత్వం, విధాన నిర్ణేతలు దృష్టి పెట్టాలి. అధిక జనాభా నుంచి లబ్ధి పొందేందుకు విద్యపై ఇన్వెస్ట్‌ చేయాలి.
► అధిక జనాభా అనుకూలత కాస్తా 2030 నాటికి ప్రతికూలంగా మారుతుంది. 
​​​​​​​► అధిక జనాభా వృద్ధి గత రెండు దశాబ్దాలుగా ఒకే విధంగా 18 కోట్లుగా ఉంది.
​​​​​​​►సంతానోత్పత్తి రేటు రాష్ట్రాల మధ్య చాలా భిన్నంగా ఉంది. కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాల్లో జననాల రేటు తగ్గింది. దీంతో ఆ రాష్ట్ర వాటా 1971లో 6.1 శాతంగా ఉంటే, 2011 నాటికి 9.5 శాతానికి చేరింది. 
ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి

‘‘తక్కువ జనాభా వృద్ధితో ప్రజలు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు బదులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులను మెరుగు పరచాలి. ఇందుకోసం కొన్ని మార్పులు చేపడితే చాలు. ప్రైవేటు పాఠశాలలకు విద్యా హక్కు చట్టం కింద ఇస్తున్న నిధుల్ని నిలిపివేసి వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల మెరుగునకు వెచ్చించాలి. తరగతి గదులు మెరుగ్గా ఉంచడం, ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, మంచి పారితోషికంతో అర్హత కలిగిన టీచర్లను నియమించడం’’ వంటి సూచనలను ఈ నివేదిక చేసింది. 

మరిన్ని వార్తలు