విమానాల్లో ఛార్జీల బాదుడు

4 May, 2018 14:22 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇక మీదట విమానంలోనూ ఫోన్‌ మాట్లాడుకునేందుకు, ఇంటర్నెట్‌ను వాడుకునేందుకు టెలికం కమిషన్‌ అనుమతించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన నిబంధన పట్ల ప్రయాణికులు ఓ వైపు సంతోషిస్తున్నప్పటికీ, మరోవైపు వారికి రుచించని మాట ఒకటి తెలియజేసింది‌. అదేంటంటే ఇక మీదట విమానంలో  ప్రయాణిస్తున్న సమయంలో కూడా మొబైల్‌ ఫోన్లను వాడవచ్చు, కానీ అందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని సంకేతాలిచ్చింది. అయితే ఈ ఛార్జీలు ఎంతమేర ఉంటాయని స్పష్టంగా తెలియజేయనప్పటికీ, అంతర్జాతీయ నిబంధనలనుసరించి నిర్ణయిస్తామని మాత్రం తెలిపింది.

కాగా, అంతర్జాతీయంగా కొన్ని దేశాలు 10ఎంబీ డేటా వాడుకుంటున్నందుకు 4.5 డాలర్లు(రూ. 350) వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకైతే అంతర్జాతీయ రూట్లలో దేశీయ విమానయాన సంస్థలు ఇంటర్నెట్‌ సేవలకు 30నిమిషాలకు రూ.500, గంటకు రూ.1000 ఛార్జ్‌ చేస్తున్నాయి.అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఇక మీదట ఇన్‌ ఫ్లయిట్‌ ఇంటర్నెట్‌, మొబైల్‌ కాల్స్‌ మాట్లాడాలంటే అర గంట నుంచి గంటకు రూ.500 - 2000 చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇన్‌ ఫ్లైయిట్‌ ఇంటర్నెట్‌ చార్జీల నిర్ణయం విషయంలో ట్రాయ్‌ జోక్యం ఉండదని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ స్పష్టం చేశారు. సర్వీసు ప్రొవైడర్లే ఆ చార్జీలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు