ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ‘2గుడ్‌’

23 Aug, 2018 02:50 IST|Sakshi

బెంగళూరు: భారత అతి పెద్ద ఈ–కామర్స్‌ మార్కెట్‌ ప్లేస్‌ ఫ్లిప్‌కార్ట్‌... మరమ్మతు చేసి, బాగు చేసిన (రిఫర్బిష్‌డ్‌) వస్తువుల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. చిన్న చిన్న లోపాల కారణంగా పనికి రాకుండా పోయిన పాత వస్తువులను రిపేర్లు చేసి మళ్లీ వినియోగానికి పనికివచ్చేలా చేయడాన్ని రిఫర్బిష్‌డ్‌గా వ్యవహరిస్తారు.

ఇలాంటి వస్తువుల కోసం తొలిసారిగా ఈ 2గుడ్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై తొలిసారిగా స్మార్ట్‌ఫోన్లను, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కేటగిరీ వస్తువులను అందిస్తామని చెప్పారాయన.

3–12 నెలల వారంటీ...
ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులకు 3 నుంచి 12 నెలల వారంటీని ఇస్తున్నామని, విస్తృతమైన సర్వీసింగ్‌ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయానంతర సర్వీసులను కూడా అందించనున్నామని కళ్యాణ్‌ పేర్కొన్నారు. ఈ విభిన్నమైన సెగ్మెంట్లో కొత్త వినియోగదారులను సాధించడంపై దృష్టి పెడుతున్నామని వివరించారు. అంతేకాకుండా భారత ఈ కామర్స్‌ రంగంలో తమ అగ్రస్థానాన్ని మరింతగా పటిష్టపరచుకోనున్నామని పేర్కొన్నారు. రిఫర్బిష్‌డ్‌ వస్తువులకు మార్కెట్లో అవకాశాలు అపారంగా ఉన్నా, సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ గోటేటి చెప్పారు.  

మరిన్ని వార్తలు