ఆర్బీఐ పాలసీ, ఎఫ్పీఐలకు పన్ను ఊరట అంశాలపై దృష్టి
చైనా–అమెరికా వాణిజ్య చర్చలు కూడా మార్కెట్కు కీలకం
ముంబై: గడిచిన నాలుగు వారాల్లో ఆరు శాతం నష్టాలను నమోదుచేసి, బేర్ గుప్పిట్లో ఉన్న అంశాన్ని స్పష్టంచేసిన దేశీ ప్రధాన స్టాక్ సూచీలు.. గతవారాంతాన ఒక్కసారిగా షార్ప్ రికవరీని ప్రదర్శించి ఈ పట్టులోంచి బయటపడుతున్న సంకేతాలను పంపాయి. అయితే, కీలక నిరోధస్థాయిలను దాటలేకపోయిన కారణంగా.. మార్కెట్ ఇక్కడ నుంచి ఏ దిశను తీసుకుంటుందనే అంశం పరంగా ఈ వారం ట్రేడింగ్ అత్యంత కీలకంగా మారిపోయింది. ఈ స్థాయిల నుంచి మద్దతు తీసుకుని బేర్ పంజా నుంచి బయటపడతాయా..? లేదంటే, బుల్స్ను చిత్తుచేసి మరింత పతనాన్ని నమోదుచేయనున్నాయా అనే అంశాలకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష, అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వంటి పలు కీలక పరిణామాలు సమాధానాలుగా నిలవనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెసర్ల (ఎఫ్పీఐ) సర్చార్జ్కి సంబంధించి ఈవారంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటును కల్పించినా మార్కెట్లో బౌ¯Œ ్స–బ్యాక్ ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
వడ్డీ రేట్ల కోతకు అవకాశం..!
ఆర్బీఐ గవర్నర్ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈనెల 5న (సోమవారం) సమావేశంకానుంది. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లు తగ్గేందుకు అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
900 కంపెనీల క్యూ1 ఫలితాలు
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, టైటాన్, సిప్లా, మహీంద్రా అండ్ మహీంద్రా, అరబిందో ఫార్మా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, వోల్టాస్, హెచ్పీసీఎల్ టాటా స్టీల్, సిమె¯Œ ్స, అల్ట్రాటెక్ సిమెంట్, ఇమామి, అదానీ ఎంటర్ప్రైజెస్తో పాటు మొత్తం 900 కంపెనీల ఫలితాలు ఈ వారంలో వెల్లడికానున్నాయి.
వాణిజ్య చర్చలపై మార్కెట్ దృష్టి
అమెరికాల–చైనాల మధ్య వాణిజ్య చర్చలు మంగళవారం నుంచి షాంఘైలో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో ఇరు దేశాలకు చెందిన వాణిజ్య ప్రతినిధులు పాల్గొనున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ చర్చలు ఏమేరకు ఉపయోగపడతాయో అన్న విషయంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి.
2 రోజుల్లో 2,881కోట్ల ఎఫ్పీఐ అమ్మకాలు
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఆగస్టు 1–2, రెండురోజుల్లో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,633 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. డెట్ మార్కెట్ నుంచి మరో రూ.248 కోట్లను వెనక్కు తీసుకోవడం ద్వారా ఈనెల్లో వీరు మొత్తం రూ.2,881 కోట్లను ఉపసంహరించుకున్నారు.