అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

19 Aug, 2019 09:06 IST|Sakshi

బుధవారం ఎఫ్‌ఓఎంసీ జూలై సమావేశపు మినిట్స్‌ వెల్లడి

శుక్రవారం జరిగే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక సదస్సులో పావెల్‌ ప్రసంగం

ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశ మినిట్స్‌ ఈవారంలోనే..

ముంబై: సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తేల్చిచెప్పకపోడం, ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపే విధంగా ప్రకటనలు చేయకపోవడం వంటి నిరాశాపూరిత వాతావరణంలో గతవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు నష్టాలను నమోదుచేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) అమ్మకాల ధాటికి అంతక్రితం వారంలో గడించిన లాభాల్లో కొంత కోల్పోయినప్పటికీ.. రిలయన్ ్స ఇండస్ట్రీస్‌ షేరుకు లభించిన కొనుగోలు మద్దతుతో భారీ నష్టాలకు అడ్డుకట్టపడింది. వారాంతాన నిఫ్టీ 11వేల పాయింట్ల సైకిలాజికల్‌ మార్కుకు ఎగువన నిలిచింది. ఈ ముగింపుతో కన్సాలిడేషన్  సూచనలు కనిపిస్తుండడం కాస్త సానుకూల అంశంగానే ఉండగా.. ఫలితాల సీజన్  నిరాశపరచడం, అమెరికా–చైనాల మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధం ప్రపంచ వృద్ధికి సవాలు విసురుతుండటం వంటి ప్రతికూలతల నేపథ్యంలో ఇక్కడ నుంచి మార్కెట్‌ ఏ దిశగా ప్రయాణిస్తుందనే అంశానికి, అంతర్జాతీయ అంశాలే ఈవారంలో అత్యంత కీలకంగా ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఎఫ్‌ఓఎంసీ మినిట్స్,పావెల్‌ ప్రసంగంపై ఇన్వెస్టర్ల దృష్టి..
జాక్సన్‌ హోల్‌ ఎకనామిక్‌ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ చైర్మన్  జెరోమ్‌ పావెల్‌ ఈనెల 23న(శుక్రవారం) ప్రసంగం చేయనున్నారు. తదుపరి వడ్డీరేట్ల అంశంపై ఈయన ప్రసంగం ద్వారా పలు సూచనలు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇక్కడ జరగనున్న పరిణామాలపై దృష్టిసారించారు. ఇక బుధవారం ఎఫ్‌ఓఎంసీ జూలై సమావేశ మినిట్స్‌ వెల్లడికానుండగా.. అమెరికాలో ఇప్పటికే ఉన్న గృహ అమ్మకాల డేటా కూడా ఇదే రోజున వెల్లడికానుంది. గురువారం యూఎస్‌ సర్వీసెస్‌ పీఎంఐ, ఇనీషియల్‌ జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ గణాంకాలు విడుదలకానున్నాయి. శుక్రవారం నూతన గృహ అమ్మకాల డేటా విడుదలకానుంది. దేశీయంగా ఆర్‌బీఐ తాజా ద్రవ్య విధాన సమీక్ష సమావేశ మినిట్స్‌ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ పరిణామాలపై ఈవారంలో ఇన్వెస్టర్లు దృష్టిసారించారని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు.

మరిన్ని వార్తలు