ఇది ‘భారతీయ’ ఐకియా..!!

5 Jul, 2018 00:45 IST|Sakshi

ఈ నెల 19న హైదరాబాద్‌ స్టోర్‌ ఆరంభంఇక్కడి జనాభాకు తగ్గట్టు భారీ రెస్టారెంట్‌ వంటకాల్లోనూ ‘భారతీయ’ మార్పులు...ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఐకియా’ డెలివరీ దీనికోసం 150 మంది సిబ్బంది;   ‘గతి’తో భాగస్వామ్య ఒప్పందం  విక్రయించే వస్తువుల్లోనూ మార్పుచేర్పులుఫర్నిషింగ్, ఫర్నిచర్‌ విక్రయాలు మాత్రమే... వచ్చే ఏడాది ముంబై స్టోర్‌తో ఆన్‌లైన్లోకి కూడా...  ఐకియా ఇండియా సీఈఓ పీటర్‌ బెజెల్‌ వెల్లడి  
ఐకియా... ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ స్వీడిష్‌ కంపెనీ వార్షికాదాయం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు. హోమ్‌ ఫర్నిషింగ్‌ రంగంలో తిరుగులేని అంతర్జాతీయ దిగ్గజం ఈ సంస్థ. కాకపోతే 75 ఏళ్ల కిందట చిన్న దుకాణంగా ఆరంభమైన ఈ సంస్థకు.. కొన్ని నియమాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా స్టోర్లన్నీ ఒకేలా ఉంటాయి. ప్రతి స్టోర్‌లోనూ ఉద్యోగుల్లో 50% మగవారు, 50% మహిళలు ఉంటారు. ప్రతి స్టోర్లో రెస్టారెంట్‌ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు... ఐకియాలో విక్రయించే వస్తువులన్నీ దాదాపుగా అట్టపెట్టెల్లో ప్యాక్‌ చేసేసుకోవచ్చు. ఎవరికి వారు ఇంటికి తెచ్చుకుని సొంతంగా బిగించేసుకోవచ్చు. అలాంటి ఐకియా... భారత్‌లో అడుగుపెట్టడానికి ఆరేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలెట్టింది. మొట్టమొదటి స్టోర్‌కు హైదరాబాద్‌ను ఎంచుకుంది. అవన్నీ ఫలించి... తొలి స్టోర్‌ ఈ నెల 19న ఆరంభమవుతోంది. ఈ సందర్భంగా ఐకియా ఇండియా సీఈఓ పీటర్‌ బెజెల్‌ బుధవారం కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌ కోసం తమ నియమాలు కొన్నింటిని ఎలా మార్చుకుంటున్నదీ వివరించారు. అవేమిటంటే... 

భారీ రెస్టారెంట్‌...
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐకియా స్టోర్‌లో భారీ రెస్టారెంట్‌ ఉంటుంది.  కనిష్ఠంగా 400 నుంచి గరిష్ఠంగా 700 మంది ఒకేసారి కూర్చునే వీలుం టుంది. కానీ హైదరాబాద్‌ జనాన్ని, ఇక్కడి మార్కె ట్‌ను చూశాక ఆ మాత్రం సీట్లు సరిపోతాయన్న నమ్మకం ఐకియాకు లేకపోయింది. అందుకే.. ఇక్కడ ఏకంగా ఒకేసారి వెయ్యి మంది కూర్చునేలా భారీ రెస్టారెంట్‌ను నిర్మించారు. అన్నిచోట్లా రెస్టా రెంట్లలో ఫోర్క్‌ను విక్రయిస్తుండగా.. ఇక్కడి ఆచార వ్యవహారాల కారణంగా దాన్ని నిషేధించారు.  

డెలివరీ కూడా చేస్తారు?
ప్రపంచంలో ఎక్కడా ఐకియా తను విక్రయించే వస్తువుల్ని డెలివరీ చెయ్యదు. అదే ఈ సంస్థ ప్రత్యేకత కూడా. ఫర్నిచర్, ఫర్నిషింగ్‌ వస్తువుల్ని అట్టపెట్టెల్లో పట్టేలా తయారు చెయ్యడం, ఎవరికి వారు రవాణా చేసుకునేందుకు వీలుగా ఉంచటం సంస్థ ప్రత్యేకత. ఈ ఖర్చులన్నీ లేకపోవటం వల్ల ఐకియాలో వస్తువులు తక్కువ ధరకు లభిస్తుంటాయి కూడా. కానీ ఇండియాలో ఈ పద్ధతి పనిచెయ్యదేమోనని సంస్థ సందేహిస్తోంది. అందుకే ఇక్కడ కావాలనుకున్న వారికి కాస్తంత అదనపు ఛార్జీలతో వస్తువుల్ని డెలివరీ చెయ్యడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. వస్తువుల్ని ఇంటివద్దకు తెచ్చి బిగించడానికి 150 మంది సిబ్బందిని అదనంగా నియమించుకుంది. వీరిలో సగం మహిళలే. ఇంకో విశేషమేంటంటే వస్తువుల్ని ఇంటికి డెలివరీ చెయ్యడానికి హైదరాబాద్‌లో ప్రముఖ లాజిస్టిక్‌ సంస్థ ‘గతి’తో ఒప్పందం చేసుకున్నట్లు కూడా పీటర్‌ బెజెల్‌ తెలియజేశారు.  

అమ్మే వస్తువుల్లోనూ మార్పులు
ఐకియాలో ఎక్కడైనా వస్తువులు ఒకేలా ఉంటాయి. కానీ హైదరాబాద్‌ స్టోర్‌కు వచ్చేసరికి కొన్ని వస్తువుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు చెంచాల సెట్‌ను తీసుకుంటే... అందులో చెంచాలు, ఫోర్క్‌లు మాత్రమే ఉన్నాయి. ఇతర దేశాల్లోని మాదిరిగా చాకు లేదు. ‘‘అది ఇండియాకు అంత ముఖ్యం కాదు. అందుకే దాన్ని సెట్‌ నుంచి తీసి విడిగా పెట్టాం’’ అని చెప్పారు బెజెల్‌. మరో విశేషమేంటంటే ఎక్కడైనా ఐకియా స్టోర్లలో బెడ్‌షీట్లు, లినెన్‌ వంటివి ప్రింటెడ్‌ కలర్స్‌ దొరకవు. ప్లెయిన్‌వి మాత్రమే దొరుకుతాయి. ‘‘భారతీయుల అవసరాలు వేరు. అభిరుచులు వేరు. అందుకే తొలిసారిగా ఇక్కడ ప్రింటెడ్‌ బెడ్‌ షీట్లను విక్రయానికి పెడుతున్నాం’’ అని బెజెల్‌ వివరించారు.
 
గృహోపకరణాలు లేవు?
మిగతా దేశాల్లోని ఐకియా స్టోర్లలో టీవీ, ఫ్రిజ్, మిక్సీ వంటి గృహోపకరణాలన్నీ విక్రయిస్తుంటారు. వాటికి వేరేవేరే బ్రాండ్లు కూడా ఉంటాయి. నిజానికి ఈ బ్రాండ్ల టీవీల వంటివి నాణ్యంగా ఉండటంతో పాటు ధర కూడా తక్కువే. కాకపోతే హైదరాబాద్‌తో సహా ఇండియాలో రాబోయే స్టోర్లలో ప్రస్తుతానికి అలాంటి అవకాశమేదీ లేదు. ఎందుకంటే ఐకియా ఇక్కడ అడుగుపెడుతున్నది సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ మార్గంలోనే. అంటే.. ఏం విక్రయించినా ఐకియా బ్రాండ్‌తోనే విక్రయించాలి. ‘‘అందుకే ఇక్కడ ఫర్నిచర్, హోమ్‌ ఫర్నిషింగ్‌తో పాటు లైటింగ్‌ పరికరాలు, వంటింటి ఉపకరణాలు మాత్రం విక్రయిస్తున్నాం. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతర గృహోపకరణాలు విక్రయించటం లేదు’’ అని బెజెల్‌ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు.

వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లోకి... 
ఐకియా తెలంగాణ ఎండీ జాన్‌ అచిలియాతో కలిసి బెజెల్‌ మరిన్ని వివరాలు వెల్లడించారు. రెండవ స్టోర్‌ వచ్చే ఏడాది ముంబైలో ఆరంభమవుతుందని, దాంతో పాటే దేశంలో ఆన్‌లైన్‌ విక్రయాలను కూడా ఆరంభిస్తామని తెలియజేశారు. వారంలో ఏడు రోజులూ స్టోర్‌ తెరిచే ఉంటుందని, రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకూ పనిచేస్తుందని వెల్లడించారు. ‘‘భారతదేశంలో మా వ్యాపారమనేది దీర్ఘకాలిక లక్ష్యం. తొలుత భారీ నగరాలపై దృష్టి పెడతాం. వచ్చే నాలుగేళ్లలో పాతిక స్టోర్లు ఏర్పాటు చేస్తాం. ఆ తరవాత 10 లక్షల జనాభా దాటిన 49 నగరాల్లోనూ స్టోర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉంది. హైదరాబాద్‌ స్టోర్‌కు దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ముంబైలో ఆన్‌లైన్‌ విక్రయాలు ఆరంభించాక.. పరిస్థితిని చూసి వాటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. ఇక మేం విక్రయించే వస్తువుల్లో 20% ఇప్పటికే స్థానికంగా తయారు చేయిస్తున్నాం. మిగతా 80 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. స్థానికంగా తయారు చేసే వస్తువుల్ని 50 శాతానికి చేర్చాలనే దీర్ఘకాలిక లక్ష్యం ఉంది. ఇండియాకు తగ్గట్టుగా ఇప్పటికే కొన్ని మార్పులు చేశాం. మున్ముందు మరిన్ని మార్పులకు సిద్ధం’’ అని వివరించారు.

రెండేళ్ల శ్రమ కొలిక్కొచ్చింది... 
హైదరాబాద్‌ స్టోర్‌ ఏర్పాటు చేయడానికి రెండేళ్లు పట్టింది. మావి స్వల్పకాలిక లక్ష్యాలు కావు. రెండేళ్లలో లాభాల్లోకి వచ్చేసి... నాలుగేళ్లలో మొత్తం పెట్టుబడిని రాబట్టుకోవాలని, త్వరత్వరగా దేశమంతా విస్తరించెయ్యాలని మేం అనుకోవటం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మాది వందేళ్ల వ్యూహం. పెట్టుబడులు పెడుతూనే ఉంటాం. విస్తరిస్తూనే ఉంటాం. ఇక్కడి ఉద్యోగులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారికి ఐదురోజుల పనిదినాలు మాత్రమే కాదు. కనీస వేతనాలకన్నా రెట్టింపు ఇస్తున్నాం. కనీస వేతనం అనే మాట పక్కనబెట్టి జీవనానికి అవసరమైన వేతనం చెల్లించాలనేది మా ఉద్దేశం. ఉద్యోగుల్లో సగం మంది మహిళలుండాలనే మా నిబంధనను మాత్రం మేం ఎక్కడ సవరించుకోవటం లేదు. 
–జాన్‌ అచిలిస్, హెడ్‌(తెలంగాణ– ఐకియా) 
మంథా రమణమూర్తి

మరిన్ని వార్తలు