ఈ కార్లపై 30వేల డిస్కౌంట్ ఆఫర్

29 May, 2017 16:41 IST|Sakshi
ఈ కార్లపై 30వేల డిస్కౌంట్ ఆఫర్
ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ ఇండియా తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. తన కాంపాక్ట్   ఎస్యూవీ ఎకో స్పోర్ట్, సెడాన్ ఆస్పైర్, హ్యచ్ బ్యాక్ ఫిగో కార్లపై 30,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నట్టు తెలిపింది. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో కొత్త పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించడానికి  ఈ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారుపై 20వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.7.18 లక్షల నుంచి రూ.10.76 లక్షల వరకు ఉంది. అదేవిధంగా ఫిగో, ఆస్పైర్ వాహనాలపై కూడా వేరియంట్ ను బట్టి 10వేల రూపాయల నుంచి 25వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను లబ్దిని పొందవచ్చట.
 
ఫిగో ధర ప్రస్తుతం ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.4.75 లక్షల నుంచి రూ.7.73 లక్షల వరకూ ఉండగా.. ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ధర రూ.5.44 లక్షల నుంచి రూ.8.28 లక్షల వరకు ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చే లోపలే ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం చాలా సంతోషంగా ఉందని ఫోర్డ్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ రైనా చెప్పారు. ఇప్పటికే లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా జీఎస్టీ అమలు నేపథ్యంలో మేడిన్ ఇండియా మోడల్స్  రేట్లకు భారీగా కోత పెట్టింది.  మరో లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ కూడా  ఎక్స్ షోరూం ధరలపై 12 శాతం వరకు ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది.  
మరిన్ని వార్తలు