కొచర్‌కి షాకిచ్చిన ఇమ్మిగ్రేషన్‌

7 Apr, 2018 08:45 IST|Sakshi
వీడియోకాన్‌ - ఐసీఐసీఐ బ్యాంకు రుణ కేసు (ఫైల్‌ ఫోటో)

ముంబై : వీడియోకాన్‌ రుణాల కుంభకోణ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ చందాకొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌కు ఇమ్మిగ్రేషన్‌ అథారిటీలు షాకిచ్చారు. దేశం విడిచి వెళ్లకుండా... ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. కొచర్‌తో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌పై కూడా ఈ ట్రావెల్‌ బ్యాన్‌ విధించినట్టు ఇమ్మిగ్రేషన్‌ అథారిటీలు పేర్కొన్నారు. వీరిద్దరిపై లుకౌట్‌ సర్క్యూలర్‌ జారీచేసినట్టు చెప్పారు. ఐసీఐసీఐ బ్యాంకు జారీచేసిన రూ.3250 కోట్ల రుణ వ్యవహారంలో వీరిద్దరిపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టిన సంగతి తెలిసిందే.  సీబీఐ అభ్యర్థన మేరకు ధూత్‌, దీపక్‌ కొచర్‌లకు వ్యతిరేకంగా లుకౌట్‌ నోటీసు జారీచేశామని సంబంధిత ప్రభుత్వ అధికారులు చెప్పారు. 

అదేవిధంగా చందాకొచర్‌ ఒకవేళ భారత్‌ విడిచి ట్రావెల్‌ చేయాలనుకుంటే, తమకు సమాచారం అందించాలని ఇమ్మిగ్రేషన్‌ అథారిటీలను సీబీఐ ఆదేశించినట్టు తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించడానికి సీబీఐ అధికార ప్రతినిధి నిరాకరించారు. ‘నాపై వస్తున్న ఈ వార్తలన్నీ ఊహాగానాలే. నాకు వ్యతిరేకంగా ఎలాంటి లుక్‌అవుట్‌ నోటీసు జారీ కాలేదు. ఇవన్నీ రూమర్లే. నా పాస్‌పోర్టుకు రెండు నెలల క్రితమే గడువు తీరిపోయింది. గత ఐదేళ్లుగా నేను దేశం విడిచి ఎక్కడికీ వెళ్లలేదు. దేవుడు అంతా చూస్తాడు. నాపై రూమర్లు క్రియేట్‌ చేసే వారిని దేవుడు శిక్షిస్తాడు’ అని ధూత్‌ అన్నారు. కాగ, దీపక్‌ కొచర్‌ సోదరుడు రాజీవ్‌ కొచర్‌ దేశం విడిచి వెళ్లే సమయంలో ముంబైలో ఆయన్ను ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డగించిన సంగతి తెలిసిందే. రాజీవ్‌ కొచర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పీఈ కానీ, లుకౌట్‌ నోటీసు కానీ సీబీఐ జారీచేయలేదు. 
 

మరిన్ని వార్తలు