టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ

18 Sep, 2018 13:52 IST|Sakshi

బెంగళూరు : టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బన్సాల్‌కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందేనని ఇన్ఫోసిస్‌ను ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. తనకు చెల్లించాల్సిన రూ.17 కోట్ల సెవరెన్స్‌ ప్యాకేజీ విషయంలో రాజీవ్‌ బన్సాల్‌  ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బన్సాల్‌ ఫిర్యాదుకు వ్యతిరేకంగా కంపెనీ కౌంటర్‌ ఫిర్యాదును కూడా దాఖలు చేసింది. అంతకముందు చెల్లించిన రూ.5.2 కోట్లను, ఇతర డ్యామేజ్‌లను కంపెనీకి తిరిగి చెల్లించాలంటూ బన్సాల్‌ను ఆదేశించాలని ఇన్ఫీ తన ఫిర్యాదులో పేర్కొంది. కానీ ఈ ఫిర్యాదును ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ కొట్టివేసింది. ఈ విషయంపై తదుపరి చర్యల కోసం న్యాయ సూచనలు తీసుకుంటామని కంపెనీ బొంబై స్టాక్‌ ఎక్స్చేంజ్‌కు తెలిపింది.  

రాజీవ్‌ బన్సాల్‌ సెవరెన్స్‌ ప్యాకేజ్‌ విషయంలో ఇన్ఫోసిస్‌లో పెద్ద వివాదమే నెలకొంది. కంపెనీ గవర్నెన్స్‌లు దెబ్బతిన్నాయంటూ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి, కంపెనీ బోర్డుకు వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. సెవరెన్స్‌ ప్యాకేజీ కింద రాజీవ్‌కు పెద్ద మొత్తంలో ఆఫర్‌ చేశారంటూ ఆరోపించారు. చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌గా 2015లో రాజీవ్‌ బన్సాల్‌ రాజీనామా చేశారు. అప్పుడు రూ.17.38 కోట్ల సెవరెన్స్‌ ప్యాకేజీ ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. దానిలో కేవలం రూ.5 కోట్లు మాత్రమే రాజీవ్‌కు చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించకుండా అలా ఆపివేసింది. మిగతా మొత్తాన్ని కూడా తనకు చెల్లించాలని కోరుతూ.. బన్సాల్‌ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 

మరిన్ని వార్తలు