పేరెంట్‌ చైనా - గ్లాండ్‌ ఫార్మా ఐపీవోకు

11 Jul, 2020 09:07 IST|Sakshi

పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు

రూ. 5000-6000 కోట్ల సమీకరణ లక్ష్యం

హైదరాబాద్‌లో 3, వైజాగ్‌లో1 ప్లాంట్లు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన గ్లాండ్‌ ఫార్మా పబ్లిక్‌ ఇష్యూ చేపడుతోంది. ఇందుకు అనుమతించమని కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుంది. కంపెనీ మాతృ సంస్థ ఫోజన్‌ ఫార్మా. చైనాకు చెందిన షాంఘై ఫోజన్‌ ఫార్మాస్యూటికల్‌. దీంతో చైనా మాతృ సంస్థగా కలిగన కంపెనీ తొలిసారి దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన రికార్డును సాధించనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

ప్రాస్పెక్టస్‌ ఇలా
ఐపీవో చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ నెల 10న గ్లాండ్‌ ఫార్మా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000-6,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు తెలియజేసింది. పబ్లిక్‌ ఇష్యూ నిర్వహణకు సిటీ, కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, నోమురా తదితర సంస్థలను మర్చంట్‌ బ్యాంకర్లుగా ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే గ్లాండ్‌ ఫార్మా ఐపీవో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్‌-మార్చి 21)లో మార్కెట్లను తాకే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐపీవో నిధులను విస్తరణపై పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో గ్లాండ్‌ ఫార్మా పేర్కొంది.

2017లో 
హాంకాంగ్‌లో లిస్టయిన ఫోజన్‌ ఫార్మా 2017 అక్టోబర్‌లో గ్లాండ్‌ ఫార్మాను సొంతం చేసుకుంది. 74 శాతం వాటాను 1.09 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన పీఈ సంస్థ కేకేఆర్‌ సైతం.. వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. జనరిక్‌ ఇంజక్టబుల్స్‌ రూపొందించే గ్లాండ్‌ ఫార్మాను 1978లో పీవీఎన్‌ రాజు, డాక్టర్‌ రవి పెన్మెత్స ఏర్పాటు చేశారు. 1999 నుంచీ వైస్‌చైర్మన్‌, ఎండీగా డాక్టర్‌ రవి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా యూఎస్‌, యూరోపియన్‌ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని పొందుతోంది. కంపెనీ హైదరాబాద్‌లో మూడు, విశాఖపట్టణంలో ఒకటి చొప్పున ప్లాంట్లను నిర్వహిస్తోంది.

రెండో ఇష్యూ!
కోవిడ్‌-19 చెలరేగడంతో ఇటీవల ఐపీవో మార్కెట్‌ డీలా పడింది. లాక్‌డవున్‌ల విధింపు తదుపరి తొలిసారి రోజారీ బయోటెక్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తున్న విషయం విదితమే. సోమవారం నుంచీ ప్రారంభంకానున్న రోజారీ ఐపీవో బుధవారం ముగింయనుంది. రోజారీ బయోటెక్‌ ఐపీవోకు రూ. 423-425 ధరల శ్రేణికాగా.. రూ. 496 కోట్లవరకూ నిధులను సమీకరించాలని ఆశిస్తోంది.   

మరిన్ని వార్తలు