4 రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ఎంత తగ్గాయో తెలుసా?

2 Jun, 2018 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ : వాహనదారులకు ఆయిల్‌ కంపెనీలు పైసా పైసా ముష్టి వేస్తున్నాయి. పెంచేటప్పుడు భారీగా పెంచేసి, తగ్గించేటప్పుడు పైసల చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. ఎంత అనుకుంటున్నారు? అది కేవలం 9 పైసలు మాత్రమే. దీంతో నాలుగు రోజుల పాటు వరుస తగ్గింపుతో పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 20 పైసలు ధర తగ్గింది.

న్యూఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర రూ.78.20గా, లీటరు డీజిల్‌ ధర రూ.69.11గా పలుకుతోంది. సమీక్షించిన ధరల ప్రకారం ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్‌ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. కోల్‌కతాలో రూ.80.84గా, ముంబైలో రూ.86.01గా, చెన్నైలో రూ.81.19గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్‌ ధర కోల్‌కతాలో రూ.71.66గా, ముంబైలో రూ.73.58గా, చెన్నైలో రూ.72.97గా రికార్డయ్యాయి. 

మే 30 ముష్టివేసినట్టు ఒక్క పైసా ధర తగ్గించిన ఆయిల్‌ కంపెనీలు, ఆ తర్వాత రోజు పెట్రోల్‌ ధరపై 7 పైసలు, డీజిల్‌పై 5 పైసల తగ్గింపును చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఇదే మాదిరి పెట్రోల్‌పై 6 పైసలు, డీజిల్‌పై 5 పైసలు తగ్గించాయి. ఇలా.. సింగిల్‌ డిజిట్‌లో పైసల లెక్కనే తగ్గిస్తున్నాయి.. కానీ వాహనదారులపై ఆయిల్‌ కంపెనీలు కనీస కనికరం చూపించడం లేదు. ఆయిల్‌ కంపెనీలు చేపడుతున్న ఈ పైసల తగ్గింపుపై వాహనదారులు మండిపడుతున్నారు.

పైసా పైసా కూడగట్టుకుని అపార్ట్‌మెంట్లు  కట్టించుకోవాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే, ఈ పైసలను మ్యూచువల్‌ ఫండ్స్‌లో పొదుపు చేసుకోవాలా? అంటూ ఛలోక్తులు కురిపిస్తున్నారు.  ఈ పైసాతో నేను వెంటనే డిస్కొంట్ రేట్లలో కారు కొంటాను.. త్వరపడండి.. ట్యాంకు ఫుల్‌ చేసుకోండి అంటూ సోషల్‌ మీడియాలో ఫుల్‌గా కామెంట్లు పేలుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు