ఆపిల్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌

27 Dec, 2018 17:20 IST|Sakshi

దేశీయంగా హై ఎండ్‌ ఐఫోన్స్‌ అసెంబ్లింగ్‌

చెన్నైలో ఫాక్స్‌కాన్‌ యూనిట్‌లో భారీ పెట్టుబడులు

సాక్షి,  చెన్నై: ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై కన్నేసిన  స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఆపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నాటికి భారతదేశంలో  టాప్‌ ఎండ్‌  ఐఫోన్లను  తయారీని ప్రారంభించనుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులను పెట్టనుంది. తైవాన్ ఎలక్ట్రిక్ దిగ్గజం ఫాక్స్‌కాన్‌  స్థానిక యూనిట్‌  ద్వారా ఖరీదైన  ఐఫోన్లను అసెంబ్లింగ్‌ చేయనుంది.   ముఖ్యంగా ఐ ఫోన్‌ ఎక్స్‌, ఎక్స్‌ ఎస్‌,  మాక్స్‌, ఎక్స్‌ఆర్‌ లాంటి అతి  ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను  రూపొందించనుంది.

తమిళనాడులో శ్రీపెరంబూర్ ప్లాంట్‌లో ఐఫోన్ ఎక్స్‌ అసెంబ్లింగ్‌ను  సాధ్యమైనంత( వచ్చే ఏడాది ప్రారంభం నుంచి)  తొందరగా ప్రారంభించాలని  యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లోనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఈ యాపిల్ ఫోన్ల అసెంబ్లింగ్‌ను మొదలుపెడ్తామని ఫాక్స్‌కాన్ వెల్లడించింది. సుమారు రూ.2500 కోట్ల  పెట్టుబడులను ఆపిల్‌  పెడుతోంది.

మరోవైపు కొత్త విస్తరణ నేపధ్యంలో భారీగా ఉద్యోగవకాశాలు లభిస్తాయని తమిళనాడు ప్రభుత్వం ఆశిస్తోంది. సుమారు 25వేలకు పైగా ఉద్యోగావకాశాలు  రానున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి సంపత్‌ రాయిటర్స్‌తో  చెప్పారు. అయితే  ఈ వార్తలపై స్పందించడానికి ఆపిల్‌ ప్రతినిధి తిరస్కరించారు. 

కాగా విస్ట్రన్‌  కార్పోరేషన్‌  ద్వారా  బెంగళూరులో ఐ ఫోన్‌ ఎస్‌ఈ, ఆర్‌ఎస్‌ మోడల్స్‌ మాత్రమే దేశంలో ఎసంబుల్డ్‌ చేస్తోంది ఆపిల్‌ కంపెనీ. అలాగే చెన్నై ప్లాంట్‌లో గతంలో నోకియా ఫోన్లను తయారు చేసిన ఫాక్స్‌కాన్‌ ప్రభుత్వంతో వచ్చిన విబేధాల కారణంగా 2014లో ఉత్పత్తిని నిలిపివేసింది. రూ.21 వేల కోట్ల పన్ను వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో తాజాగా ఆ ప్లాంట్‌లో ఆపరేషన్స్ మొదలుపెట్టినట్టు  సమాచారం.

మరిన్ని వార్తలు