ఆల్‌-టైమ్‌ గరిష్టంలో పెట్రోల్‌ ధరలు

17 Sep, 2018 09:09 IST|Sakshi
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. పెరగడమే తప్ప, ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. వాహనదారులకు చుక్కలు చూపిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 15 పైసలు పెరిగి, రూ.82.06గా నమోదైంది. ముంబైలో కూడా 15 పైసలు పెరిగి, ఆల్‌-టైమ్‌ గరిష్టంలో రూ.89.44 మార్కును టచ్‌ చేసింది. పెట్రోల్‌కు తగ్గ రీతిలో డీజిల్‌ ధరలు కూడా సామాన్యులకు వాత పెడుతున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర 6 పైసలు పెరిగి రూ.73.78గా నమోదైంది. అలాగే ముంబైలో రూ.78.33గా ఉంది. రాజధానుల పరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తక్కువగా ఉంది కోల్‌కతాలోనే. ఈ నగరంలో లీటరు పెట్రోల్‌ను రూ.83.91 వద్ద, లీటరు డీజిల్‌ను రూ.75.53 వద్ద విక్రయిస్తున్నారు. చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.85.31కి, డీజిల్‌ ధర రూ.78 కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.86.85గా, లీటరు డీజిల్‌ ధర రూ.80.19గా నమోదైంది.

జనవరి 1 నుంచి ఢిల్లీలో పెట్రోల్‌ ధర 15.4 శాతం పెరిగింది. అంటే రూ.69.97 నుంచి ప్రస్తుతం రూ.82.06కు చేరుకున్నాయి. డీజిల్‌ ధర కూడా 22 శాతం ఎగిసింది. ఇంతలా పెట్రోల్‌, డీజిల్‌ సామాన్యులను గడగడలాడిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధనపై విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడం లేదు. ఆగస్టు నుంచి అయితే ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప అసలు తగ్గడం లేదు. క్రూడాయిల్‌ ధరలు పెరుగుతుండటం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్షీణించడం ఈ ధరల పెరుగదలకు మరింత తోడ్పడుతోంది. 

మరిన్ని వార్తలు