ఐపీఓ నిధులు అంతంతే!

27 Dec, 2019 02:21 IST|Sakshi

మందగమనం ప్రభావం

ఈ ఏడాది 60 శాతం తగ్గుదల

మెరుగుపడ్డ ఓఎఫ్‌ఎస్‌; డిజిన్వెస్ట్‌మెంట్‌ డీలా

ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల్లో వెల్లడి

ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు 60 శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్లుగా ఉన్న ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.12,362 కోట్లకు తగ్గింది. గత ఏడాది 24 కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ ఏడాది 16 కంపెనీలే ఐపీఓకు వచ్చాయి. ఈ వివరాలను క్యాపిటల్‌ మార్కెట్‌ గణాంకాలను అందించే ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. మరిన్ని వివరాలు....

► ఈ ఏడాది క్యూ2 జీడీపీ ఏడేళ్ల కనిష్ట స్థాయి, 4.5 శాతానికి పడిపోయింది. జీడీపీ మెరుగుపడుతున్న సూచనలు ఏమీ లేవు. రూ.51,000 కోట్ల సమీకరణ నిమిత్తం సెబీ ఆమోదం పొందిన 47 కంపెనీల ఐపీఓల గడువు తీరిపోవడం ఈ విషయాన్ని మరింత ప్రతిబింబిస్తోంది.  
► ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ 60 శాతం తగ్గినా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌), క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ)ల ద్వారా నిధుల సమీకరణ మాత్రం మెరుగ్గానే ఉంది. ఈ రెండు మార్గాల ద్వారా గత ఏడాది వివిధ కంపెనీలు రూ.63,651 కోట్లు సమీకరించాయి. ఇది ఈ ఏడాది రూ.81,174 కోట్లకు పెరిగింది. 2017తో పోల్చితే(రూ.1,60,032 కోట్లు) ఇది 49% తక్కువ.  
► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా స్టెర్లింగ్‌  అండ్‌ విల్సన్‌ సోలార్‌ నిలిచింది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.2,850 కోట్లు.  
► ఈ ఏడాది వచ్చిన మొత్తం 16 ఐపీఓల్లో ఏడు కంపెనీల ఐపీఓలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ ఐపీఓలు 10 రెట్లకు పైగా సబ్‌స్క్రైబయ్యాయి.  
► ఐఆర్‌సీటీసీ ఐపీఓ 109 రెట్లు, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంక్‌ వంద రెట్లకు మించి సబ్‌స్క్రైబయ్యాయి.  
► లిస్టింగ్‌ లాభాల్లో ఈ ఏడాది ఐపీఓలు అదరగొట్టాయి.  
► ఐపీఓకు వచ్చిన కంపెనీల షేర్లు వాటి ఇష్యూ ధరల కంటే దిగువకు పడిపోవడం గత కొన్నేళ్లలో పరిపాటిగా ఉండేది. ఈ ఏడాది దీనికి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో 3 కంపెనీల షేర్లు మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. మిగిలిన 13 కంపెనీల షేర్లు 21–170 శాతం రేంజ్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి.  
► ఈ ఏడాది ఐపీఓ నిధుల సమీకరణ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు బాగానే లాభపడ్డారు.  2018లో ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.10,672 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.25,811 కోట్లు వచ్చాయి.  
► ఈ ఏడాది ప్రభుత్వ వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌)కు  కలిసిరాలేదు. డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.1,05,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటిదాకా రూ.17,744 కోట్లు (17 శాతం మాత్రమే) సమీకరించింది.  
► వచ్చే ఏడాది ఐపీఓలు ఆశావహంగానే ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ 21 కంపెనీలు ఐపీఓల కోసం  సెబీ ఆమోదం పొందాయి. ఈ కంపెనీలు రూ.18,700 కోట్లు సమీకరించనున్నాయి. మరో 13 కంపెనీలు సెబీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవి రూ.18,000 కోట్ల సమీకరించడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి.

మరిన్ని వార్తలు