ఎఫ్‌ఐఐలను మెప్పిస్తున్న భారత్ బ్యాంకింగ్‌ షేర్లు

13 Jun, 2020 14:51 IST|Sakshi

ఈ ఏడాది ఆరంభం నుంచి భారత ఈక్విటీ మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్ల పట్ల ఇప్పుడు విదేశీ ఇన్వెసర్ల వైఖరి మారింది. తాజాగా వారు ఈ రంగానికి చెందిన షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా వైరస్‌ ప్రేరిపిత లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవచ్చనే ఆశావహ అంచనాలతో కొన్ని విదేశీ ఫండ్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటున్నాయి. 

‘‘ఏ వ్యవస్థలోనైనా సైక్లి్ల్స్‌ వస్తుంటాయి వెళ్తుంటాయి. భవిష్యత్తులో భారత్‌ ఆర్థిక వ్యవస్థతో పాటు అక్కడి బ్యాంక్‌లు గణనీయమైన వృద్ధిని సాధించేందుకు గణనీయమైన అవకాశాలున్నాయి. దీర్ఘకాలం దృష్టా‍్య భారత బ్యాంకింగ్‌ రంగ షేర్లను కొనుగోలు చేస్తున్నాము.’’ అని న్యూయార్క్‌ను చెందిన జీడబ్ల్యూఅండ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌సంస్థ తెలిపింది.

కఠినమైన రుణ ప్రమాణాలు కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ షేర్లు రానున్న 5ఏళ్లలో తమ ప్రత్యర్థి బ్యాంక్‌ షేర్లలో పోలిస్తే 94శాతం అధిక రాబడి ఇచ్చే అవకాశం ఉందని జీడబ్ల్యూఅండ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ అంచనా వేసింది. ఈ రెండు బ్యాంకుల్లోకి డిపాజిట్ల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అంశం బ్యాంకుల లాభదాయకతను మరింత పెంచేందుకు తోడ్పడుతుందని ఫారిన్‌ ఫండ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. 

దీర్ఘకాలికం దృష్ట్యా హెచ్‌డీఎఫ్‌సీ షేర్లపై బుల్లిష్‌ వైఖరిని కలిగి ఉన్నామని మరో అంతర్జాతీయ ఫండ్‌ మేనేజింగ్‌ కంపెనీ ఫిడిలిటీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. మార్చి 24న తర్వాత.... భారత్‌  స్టాక్‌ మార్కెట్లో వాల్యూయేషన్‌ పతనమైన, అధిక క్వాలిటీ కలిగిన ఫైనాన్షియల్‌ కంపెనీల షేర్లను ఈ ఫండింగ్‌ సంస్థ కొనుగోలు చేసింది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు, భీమా సంస్థల షేర్ల హోల్డింగ్స్‌ను పెంచుకుంది.

‘‘అధిక క్వాలిటీ కలిగిన ఫైనాన్స్‌ షేర్లను కొనుగోలును మేము ఇష్టపడతాము. ప్రభుత్వ జోక్యం, మొండిబకాయిలు పెరుగుతాయన్న భయాలతో మార్కెట్‌ తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ రంగం ఎక్కువగా ప్రభావితమైన మాట వాస్తవమే. అయితే మరోవైపు అధిక కొన్ని బ్యాంకింగ్‌ రంగ షేర్లు  వాల్యూయేషన్ల పరంగా చారిత్రాత్మక కనిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.’’ అని ఫిడిలిటీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అధికారి సమంత్‌ తెలిపారు.  

ఇటీవల అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెసర్ట్‌ భారతీయ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రతికూల అవుట్‌లుక్‌ను కేటాయించింది. అయితే దీన్ని గురించి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని సాల్ట్ లేక్ సిటీలోని వాసాచ్ అడ్వైజర్స్‌లో పని చేసే ఫండ్‌ మేనేజర్‌ అజయ్‌ కృష్ణన్‌ తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా బ్యాంక్‌ షేర్లపై తాను సానుకూల వైఖరిని కలిగి ఉన్నట్లు తెలిపారు. అలాగే తన పోర్ట్‌ఫోలియోలో బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కేటాయింపులు మరింత పెంచినట్లు తెలిపారు. ఈ షేరు ఫిబ్రవరి మధ్యలో జీవితకాల గరిష్టాన్ని తాకింది. నాటి నుంచి సగానికి పైగా విలువను కోల్పోయింది. కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలు వ్యూహాత్మకంగా ఉన్నాయని అలాగే కోల్పోయిన నష్టాల కంటే అధికంగానే లాభాలను ఆర్జిస్తుందని ఆయన అంచాన వేస్తున్నారు. బ్యాలెన్స్ షీట్ నిర్వహణ నాణ్యత ఆధారంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్, ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్‌ షేర్ల కొనుగోళ్లకు అనుకూలంగా ఉన్నట్లు కృష్ణన్‌ తెలిపారు.

జనవరిలో స్టాక్‌ సూచీలు గరిష్ట స్థాయిని తాకినప్పుడు, బ్యాంకింగ్‌ రంగ షేర్లు కొన్నేళ్ల గరిష్ట స్థాయిల వద్ద ట్రేడయ్యాయి. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. మొండి బకాయిలు పెరుగుతాయనే భయాలతో పాటు 40ఏళ్ల తర్వాత ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవచ్చనే ఆందోళనలతో  భారతీయ బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఇప్పుడు 2016 కనిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు కేంద్రం రూ.21లక్షల కోట్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అలాగే ఆర్‌బీఐ వడ్డీరేట్లను 20 ఏళ్ల కనిష్టస్థాయికి తగ్గించింది.

మరిన్ని వార్తలు