గెయిల్‌ లాభం రూ.1,310 కోట్లు

15 Nov, 2017 00:59 IST|Sakshi

42 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్‌ యుటిలిటీ కంపెనీ, గెయిల్‌ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 42 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.925 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,310 కోట్లకు చేరుకున్నట్లు గెయిల్‌ ఇండియా తెలిపింది. గ్యాస్‌ రవాణా, మార్కెటింగ్‌ వ్యాపారం వృద్ధి కారణంగా ఈ స్థాయిలో నికర లాభం సాధించామని పేర్కొంది.

ఆదాయం రూ.11,878 కోట్ల నుంచి 4.5 శాతం వృద్ధితో రూ.12,410 కోట్లకు పెరిగింది. ఇబిటా 35 శాతం వృద్ధితో రూ.2,070 కోట్లకు, ఇబిటా మార్జిన్‌ 12.9 శాతం నుంచి 16.7 శాతానికి పెరిగాయి. భారత్‌లో అతి పెద్ద నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ఈ కంపెనీ గ్యాస్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యాపారంలో ఈ క్యూ2లో రూ.853 కోట్ల స్థూల లాభం సాధించింది. గత క్యూ2లో ఈ స్థూల లాభం రూ.661 కోట్లుగా ఉంది.

మరోవైపు గ్యాస్‌ మార్కెటింగ్‌ వ్యాపార ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.420 కోట్లకు పెరగ్గా, పెట్రోకెమికల్‌ వ్యాపార ఆదాయం సగానికి తగ్గి, రూ.89 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో గెయిల్‌ షేర్‌ 0.2% లాభంతో రూ.456 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు