కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!

23 Apr, 2020 17:29 IST|Sakshi

 క్లినికల్ ట్రయిల్స్  పూర్తయితే,  ఔషధం లాంచ్

 ట్రయిల్స్ , మార్కెటింగ్ అనుమతికి  ప్రయత్నాలు

భారత్  మార్కెట్లకు మాత్రమే  లభ్యం 

సాక్షి, ముంబై:  భారతీయ  ఔషధ దిగ్గజం గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ కరోనా వైరస్ నివారణ మందుల తయారీలో కీలక అభివృద్ధిని సాధించినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగించే యాంటీ-రెట్రోవైరల్ (ఏఆర్వీ) ను అభివృద్ధి చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా కంపెనీ అవతరించనుంది. ఈ యాంటీ వైరల్ డ్రగ్ కు సంబంధించిన ఫావిపిరవిర్ కోసం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను (ఎపిఐ) కంపెనీ అభివృద్ధి చేయగలిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ట్రయల్స్ నిమిత్తం రెగ్యులేటరీ ఆమోదం కోసం దరఖాస్తు చేసింది. అంతేకాదు ఈ మందు మార్కెటింగ్ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా వెల్లడించాయి. మార్కెటింగ్ ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)ని ఆశ్రయించినట్టు  సంస్థ ధృవీకరించింది. ఇది వాస్తవ రూపం దాలిస్తే భారతీయ ఔషధ కంపెనీల చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అని నిపుణులు భావిస్తున్నారు. (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు)

ఏఆర్వీ ఔషధం కరోనా  వైరస్ చికిత్సలో సానుకూల ఫలితాలను చూపించిందని అంచనాలు వెలువడ్డాయి. ఈ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ 14 రోజుల నుంచి 1 నెల వరకు ఉంటాయని తెలిపింది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే భారతీయ మార్కెట్లో ఈ డ్రగ్ లాంచ్ చేయనుందంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ బీసీ నివేదించింది. ఈ ఔషధం భారతదేశం కోసం మాత్రమే అభివృద్ధి చేయబడుతోందని ఇతర మార్కెట్లకు కాదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఫవిపిరవీర్ కు  పేటెంట్  లేనందున ఇతర కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించవచ్చని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఫుజిఫిలిం సంస్థ ఫావిపిరవిర్ మందును తయారు చేస్తోంది.  చైనా, జపాన్లలో కోవిడ్‌-19  రోగులకు చికిత్స చేయడానికి  కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఫుజిఫిలిం అమెరికాలో ఫావిపిరవిర్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ వార్తలతో గతరెండు సెషన్లుగా భారీగా లాభపడిన గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేర్లు గురువారం 7 శాతానికి పైగా ఎగిసాయి. (కోవిడ్ -19 : కంపెనీలకు ఊరట)

మరిన్ని వార్తలు