పెరిగిన బంగారం ధరలు

13 Jan, 2018 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ : సంక్రాంతి పండుగ సీజన్‌లో బంగారం ధరలు పైపైకి పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏడు వారాల గరిష్టంలో వంద రూపాయలు పెరిగి 30,750 రూపాయలుగా నమోదైంది.  అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్‌ సంకేతాలు మాత్రమే కాకుండా.. డాలర్‌ విలువ పడిపోవడం, స్థానిక ఆభరణ వర్తకదారుల నుంచి కొనుగోళ్లు దేశీయ స్పాట్‌ మార్కెట్‌లో బంగారం ధరను పెంచుతున్నాయని బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. 

గ్లోబల్‌గా బంగారం ధరలు ఒక్కో ఔన్స్‌కు 1.17 శాతం పెరిగి 1,337.40 డాలర్లుగా నమోదయ్యాయి. అదేవిధంగా సిల్వర్‌ ధరలు కూడా 1.44 శాతం లాభపడి, ఔన్స్‌కు 17.21 డాలర్లకు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 10 గ్రాములకు 30,750 రూపాయలుగా, 30,600 రూపాయలుగా ఉన్నాయి. అదేవిధంగా వెండి ధరలు కూడా దేశీయంగా 100 రూపాయలు లాభపడి కేజీకి 39,900 రూపాయలకు పెరిగాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి మద్దతు వస్తుండటంతో, వెండి ధరలు పెరిగినట్టు బులియన్‌ ట్రేడర్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు