వేతన చెల్లింపులపై చేతులెత్తేసిన గో ఎయిర్‌

4 May, 2020 16:00 IST|Sakshi

లాక్‌డౌన్‌ ఇబ్బందులతోనే వేతనాల నిలిపివేత

సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులకు వేతనాలు అందించే పరిస్థితి లేదని తమ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్‌ వేతనాలను చెల్లించాల్సిన గో ఎయిర్‌ స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించిన ఎయిర్‌లైన్‌ మరికొందరు ఉద్యోగులను సెలవుపై పంపించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో సిబ్బందికి తక్షణమే వేతనాలు చెల్లించేందుకు నిధులు లేవని గోఎయిర్‌ సీఎండీ నుస్లీ వాదియా, ఎండీ జే వాదియా ఉద్యోగులకు సంయుక్తంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎయిర్‌లైన్‌ కార్యకలాపాలు నిలిచిపోయినందున సంస్థ వద్ద నగదు నిల్వలు లేవని వెల్లడించారు. తమకు మారో మార్గం లేకున్నా మార్చి, ఏప్రిల్‌ నెల వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో విమానయాన సర్వీసులు నిలిచిపోవడంతో అన్ని విమానయాన రంగం తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నదని వివరించారు.

మొత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందికి పూర్తి వేతనాలు చెల్లించిన గో ఎయిర్‌ మిగిలిన ఉద్యోగులకు దశలవారీగా, వాయిదాల పద్ధతిలో చెల్లింపులు చేపడతామని పేర్కొంది. ఇక లాక్‌డౌన్‌ ఫలితంగానే పరిమిత వనరుల పరిస్థితి నెలకొందని, తమ చేతిలో లేని పరిస్థితులతోనే ఉద్యోగులకు ఇబ్బందులు నెలకొన్నాయని లేఖలో సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గో ఎయిర్‌ బోర్డు సభ్యులు, సీఎండీ సైతం వేతనాలు తీసుకోవడం లేదని లేఖ పేర్కొంది. ఇక అమెరికా, దక్షిణాసియా, మధ్యప్రాచ్య, యూరప్‌ దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ అక్కడి విమానయాన సంస్థలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేలా ఆదుకున్నాయని వివరించింది. ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపరిచి, ఎయిర్‌లైన్‌ మనుగడ కోసం తాము కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని గో ఎయిర్‌ ఆ లేఖలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు