గోల్డ్‌ బాండ్‌ ధర రూ.3,890

7 Sep, 2019 09:27 IST|Sakshi

ముంబై: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 నాల్గవ సిరీస్‌ సెప్టెంబర్‌ 9వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పథకం 13వ తేదీ వరకూ చందాదారులకు అందుబాటులో ఉంటుంది. శుక్రవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం- గోల్డ్‌ బాండ్‌ ధర గ్రాముకు రూ.3,890. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే, రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. అంటే వీరికి గోల్డ్‌ బాండ్‌ రూ.3,840కే లభిస్తుందన్నమాట. లేదంటే నిర్దేశిత బ్యాంక్‌ బ్రాంచీలు, పోస్టాఫీసుల ద్వారా గోల్డ్‌ బాండ్లకు చందాదారులు కావచ్చు. 2015 నవంబర్‌లో కేంద్రం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. ఫిజికల్‌ గోల్డ్‌కు డిమాండ్‌ తగ్గించి, ఈ కొనుగోళ్ల మొత్తంలో కొంత మొత్తం పొదుపుల్లోకి మళ్లించడం ఈ స్కీమ్‌ ప్రధాన ఉద్దేశం. గ్రాము నుంచి ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్‌-మార్చి) 500 గ్రాముల వరకూ పసిడి కొనుగోళ్లకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుంటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు సంబంధిత సంస్థలు 20 ‍కేజీల వరకూ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు