గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన వెండి, బంగారం ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం ధరలు గరిష్ట స్థాయిలనుంచి దిగి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా క్షీణించాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ తెలిపారు. అటు దేశీయ స్టాక్మార్కెట్లు పుంజుకోవడం కూడా బంగారం ధరల బలహీనతకు కారణమని తెలిపారు. బుధవారం బంగారం 10 గ్రాములకి రూ .128 తగ్గి 41,148 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల స్పాట్ బంగారం రూ .128 తగ్గిందని మంగళవారం 10 గ్రాముల ధర రూ .41,276 వద్ద ముగిసింది. వెండి ధర కూడా మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే దిగి వచ్చింది. వెండి రూ .47,060 నుంచి కిలో ధర రూ .700 తగ్గి 46,360 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ఔన్స్ ధర వరుసగా 1,562.5 డాలర్లు, 17.51 డాలర్లుగా ట్రేడవుతున్నాయి. ఇటీవల కోవిడ్-2019 రేపిన ప్రకంపనలో ప్రధానంగా చమురు ధరలు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడులు బంగారం వైపు మళ్లాయి. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా పుంజుకున్న సంగతి తెలిసిందే.