బంగారం రుణాలు @  4.61 లక్షల కోట్లు 

18 Jan, 2020 02:54 IST|Sakshi

2020 నాటికి ఈ మార్క్‌ను చేరుకుంటుంది: కేపీఎంజీ 

న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్‌ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్‌ రూ.4,617 బిలియన్‌ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది.  

నివేదికలోని అంశాలు 
- 2018–19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లోకి తమ శాఖలను వేగంగా విస్తరించాయి.  
ఎన్‌బీఎఫ్‌సీలు, ఇంటి వద్దకే వచ్చి రుణాలను అందించే నూతన తరం ఫిన్‌టెక్‌ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డిజిటల్‌ వేదికగా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి.  
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతో కూడిన వ్యవస్థీకృత రంగం వాటా 35 శాతంగా ఉంది. బంగారం రుణ మార్కెట్లో సంఘతిత రంగంతో పోలిస్తే అసంఘటిత రంగ మార్కెట్‌ రెండు రెట్లు అధికంగా ఉంది. దీంతో సంఘటిత రంగం విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయి. 
ఇంత కాలంగా బంగారం రుణాలకే పరిమితమైన పెద్ద కంపెనీలు తమ వృద్ధిని కాపాడుకునేందుకు సూక్ష్మ రుణాలు, ఎస్‌ఎంఈ రుణాలపైనా దృష్టి పెట్టాయి. 
- బంగారం రుణ మార్కెట్‌ ధరల పరంగా అస్థిరత, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నిధుల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, బంగారం రుణాలను ఇచ్చే కంపెనీలు లోన్‌ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణ నిష్పత్తి)ను తక్కువగా నిర్ణయించడం, తక్కువ కాల వ్యవధికే రుణాలను ఇవ్వడం ద్వారా ధరల అస్థిరతలను అధిగమిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు