డిసెంబర్‌కల్లా రూ. 24,500కు పసిడి!

3 Nov, 2014 00:56 IST|Sakshi
డిసెంబర్‌కల్లా రూ. 24,500కు పసిడి!

ముంబై: డిసెంబర్‌కల్లా 10 గ్రాముల పసిడి ధర రూ. 24,500కు క్షీణించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేశారు. గడచిన శనివారం(1న) ఎంసీఎక్స్‌లో ఈ ధర రూ. 26,143గా నమోదైంది. అయితే ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి ప్రస్తుతమున్న స్థాయిలో నిలకడగా కొనసాగాల్సి ఉన్నదని వివరించారు. సమీపకాలంలో బంగారం ధరలు మరింత బలహీనపడతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

వారం లేదా రెండు వారాల్లో పసిడి ధరలు స్థీరీకరణ(కన్సాలిడేషన్) చెందుతాయని మోతీలాల్ ఓస్వాల్ అసోసియేట్ వైస్‌ప్రెసిడెంట్(కమోడిటీస్) కిషోర్ నార్నే అభిప్రాయపడ్డారు. డిసెంబర్ మధ్యకల్లా 10 గ్రాముల ధర రూ. 24,500కు దిగివస్తుందని అంచనా వేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్(31.1 గ్రాములు) ధర 1,173 డాలర్ల వద్ద ఉంది. ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్ క్వార్టర్లో అనూహ్య వృద్ధిని సాధించడంతో పసిడి ధరలు బలహీనపడ్డాయని నార్నే పేర్కొన్నారు. క్యూ3లో అమెరికా జీడీపీ 3.5% పురోగమించడంతో అక్కడి కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై దృష్టిపెట్టే అవకాశముందని  చెప్పారు.

తద్వారా ఓవైపు డాలరు మరింత బలపడే అవకాశమున్నట్లే మరోపక్క బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందన్నారు. విదేశీ మార్కెట్లలో ఔన్స్ పుత్తడి ధర డిసెంబర్ చివరికి 1,080-1,120 డాలర్ల స్థాయిలో స్ధిరపడవచ్చునని అంచనా వేశారు. కామ్‌ట్రెండ్ రీసెర్చ్ డెరైక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ సైతం ఇవే అభిప్రాయాలను వెల్లడించారు. దేశీయంగా డిసెంబర్‌కల్లా 10 గ్రాముల పసిడి ధర రూ. 25,000-25,500కు చేరొచ్చని అంచనా వేశారు. అయితే ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో విదేశీ మార్కెట్లలో బంగారం ఉత్పత్తి తగ్గితే ధరలు నిలబడే అవకాశముందని చెప్పారు.

మరిన్ని వార్తలు