ముంబై: బంగారం ధరలు బులియన్ మార్కెట్లో కొంత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 10 గ్రాముల ధర 31 వేల రూపాయలకు సమీపంలో అమ్మకం జరుగుతోంది. అదే సమయంలో ఎంసిఎక్స్(మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్)లో మాత్రం 24 క్యారెట్ల ధర 32,700 రూపాయలకు సమీపంలో కొనసాగుతోంది. నిన్న ఎంసిఎక్స్లో 33,355 రూపాయలకు అమ్ముడైంది.
గత రెండు రోజుల్లో రూపాయి ధర కొంత కోలుకోవడం, ఔన్స్ బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గడంతో మన దేశంలో బంగారం ధర తగ్గుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 1395 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. మరోవైపు ఆగస్టు నెలలో ఫిజికల్ గోల్డ్కు డిమాండ్ తగ్గింది. ధర భారీగా పెరగడం వల్ల డిమాండ్ తగ్గింది. వినియోగదారులు పెరిగిన ధరను క్యాష్ చేసుకుంటూ పాత బంగారాన్ని అమ్ముతున్నారు. వెండి ధర ఎంసిఎక్స్లో కేజీ 200 రూపాయలు పెరిగి 55,200 రూపాయలకు సమీపంలో అమ్ముడవుతోంది. రూపాయి బలపడితే బంగారం, వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు లాభపడి 18,979 వద్ద ముగిసింది. నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 5,593 వద్ద క్లోజయింది. ఈరోజు మార్కెట్లో బ్యాంకు షేర్లు దుమ్ము రేపాయి. బ్యాంకెక్స్ ఏకంగా 9 శాతం లాభపడింది. రియాల్టీ 5 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ నాలుగున్నర శాతం లాభపడ్డాయి. అదే సమయంలో ఐటీ సూచీ మాత్రం 3 శాతం కోల్పోయింది. గ్రూపు ఏలో యెస్ బ్యాంకు ఏకంగా 21 శాతం లాభపడింది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ 16 శాతం, యాక్సిస్ బ్యాంకు 15 శాతం, ఫెడరల్ బ్యాంకు 12 శాతం, జెపి పవర్ 11 శాతం లాభపడి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్గా వచ్చిన రఘురామ్ రాజన్ స్టాక్ మార్కెట్లకు ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చారు.