ముంబై : పసిడి ధరలు రేసుగుర్రంలా పరిగెడుతున్నాయి. చుక్కలు చూస్తున్న బంగారానికి రెక్కలొచ్చినట్టుగా పైపైకి ఎగబాకుతోంది. అంతర్జాతీయ అనిశ్చితి, కరోనా వైరస్ భయాలతో ప్రపంచవ్యాప్తంగా మదుపుదారులు పసిడిలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో యల్లోమెటల్ అంతకంతకూ భారమవుతోంది. గత కొద్ది వారాలుగా ధరాభారంతో సామాన్యుడికి దూరమైన స్వర్ణం ఆదివారం మరింతగా ప్రియమైంది. పదిగ్రాముల పసిడి ఎంసీఎక్స్లో ఏకంగా ఒక్కరోజే రూ 230 పెరిగి రూ 41,230కి చేరింది. ఇక వెండి ధరలు సైతం కిలోకు రూ 171 పెరిగి రూ 47,160కి చేరాయి. బంగారం, వెండి వేగంగా పెరుగుతున్న తీరు చూస్తే ఈ రెండు హాట్ మెటల్స్ త్వరలోనే హాఫ్సెంచరీ(రూ 50,000) మైలురాయిని చేరతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.