రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర
ఒక్క రోజులో రూ. 930 హై జంప్
గ్లోబల్ కారణాలు, డాలర్ వీక్నెస్
సాక్షి,ముంబై : నిన్నగాక మొన్న రూ. 600 తగ్గి మురిపించిన బంగారం ధరలు గురువారం రికార్డు స్తాయిలో పైకి ఎగిసాయి. ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరగడం అటు బులియన్ వర్గాలకు, ఇటు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. వెండి ధరలది కూడా ఇదే బాట. న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.930 పెరిగి రూ.35,800 పలుకుతోంది. 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.35,630 గా ఉంది. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.100 పెరిగి రూ.27,400గా నమోదైంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.36,290గా ఉండగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.33,270 పలుకుతోంది. వెండి ధర కేజీకి రూ.300 పెరిగి రూ.39,200గా ఉంది. మార్కెట్లో 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.81,000 కాగా, అమ్మకం ధర రూ.82,000. అంతర్జాతీయంగా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.3శాతం పెరిగి 1,423 డాలర్లుగా ఉంది. మార్కెట్లో ఔన్స్ వెండి ధర 15.24 డాలర్లు. ఫెడ్ వడ్డీరేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ సూచనప్రాయంగా అందించిన సంకేతాలతో తోడు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించారని బులియన్ వర్గాల అంచనా. అటు డాలరు మారకంలో రుపీ కూడా 11 వారాల గరిష్టం వద్ద బలంగానే ముగిసింది. నాలుగు రోజులనష్టాలకు చెక్ చెప్పిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు 266 పాయింట్లు ఎగిసి పాజిటివ్గా ముగిసాయి.