సాక్షి, ముంబై: ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం వారంరోజుల కనిష్టానికి పతనమైంది. ఆసియాలో ట్రేడింగ్లో ఉదయం ఔన్స్ పసిడి ధర 8.75డాలర్లు నష్టపోయి1,275.45 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫెడ్ వడ్డీరేటు యథాతథంగా ఉంచడంతో పసిడిలో అమ్మకాల ధోరణి కనబడతోంది. ఇది దేశీయంగా కూడా ప్రభావితం చేస్తోంది.
అమెరికా రిజర్వ్బ్యాంక్ పాలసీ సమీక్ష సందర్భంగా ఫెడ్ ఛైర్మన్ పావెల్ మాట్లాడుతూ ‘‘ ద్రవ్యోల్బణం బలహీనపడుతున్న నేపథ్యంలో రేట్ల కోతకు అవకాశం లేదు. కాబట్టి కీలక వడ్డీరేట్లను స్థిరంగా ఉంచుతున్నాము’’ అన్నారు. అధిక వడ్డీరేట్లు.. డాలర్, ఈల్డ్స్ ర్యాలీకి సహకరించగా, పసిడి ధరకు ప్రతికూలంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు నేటి ఆసియా మార్కెట్లో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల అమ్మకాలకు తెరలేపారు. ఇంట్రాడేలో ఒకానొక దశలో వారం రోజల కనిష్టానికి 1,273.85 స్థాయికి పతనమైంది. ఇక రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల ముగింపు నేపథ్యంలో అక్కడ మార్కెట్లో పసిడి ధర 1,284.20 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగా రూ.313 క్షీణత
దేశీయంగానూ పసిడి ధర అమ్మకాల ఒత్తిడి లోనవుతోంది. ఎంసీక్స్ ట్రేడింగ్లో జూన్ ఫ్యూచర్ కాంటాక్టు 10 గ్రాముల పసిడి ధర రూ.313 లు నష్ట పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వారం రోజుల కనిష్టానికి చేరుకోవడం, డాలర్ మారకంలో రూపాయి స్వల్పంగా బలపడటం ఇందుకు కారణవుతోంది. హైదరాబాద్లో 24 కారెట్ల పుత్తడి ధర 50 రూపాయలు క్షీణించి రూ.31,963 వద్ద, 22 కారెట్ల ధర రూ.30433 వద్ద వుంది.
వెండి ధర
ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధరలు కూడా క్షీణతను నమోదు చేస్తున్నాయి. కిలో వెండి 285 రూపాయలు పతనమై రూ.36295 వద్ద కొనసాగుతోంది.
నాలుగేళ్ల గరిష్టానికి డిమాండ్
ఇది ఇలా వుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో గ్లోబల్గా బంగారానికి డిమాండ్ 7 శాతం పుంజుకుంది. దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్ ఏకంగా నాలుగేళ్ల గరిష్టానికి చేరడం విశేషం.