జోరుగా నియామకాలు

6 Sep, 2018 01:57 IST|Sakshi

యూబీఎస్‌ సర్వే నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: డిమాండ్‌ మెరుగుపడుతున్న నేపథ్యంలో కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాలని యోచిస్తున్నాయి. దీంతో హైరింగ్‌ కార్యకలాపాలు గతేడాది కన్నా మరింత వేగం పుంజుకోనున్నాయి. యూబీఎస్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. యూబీఎస్‌ ఎవిడెన్స్‌ ల్యాబ్స్‌ నిర్వహించిన సీ–సూట్‌ సర్వేలో 247 మంది ఎగ్జిక్యూటివ్స్‌ (సీఈవోలు, సీఎఫ్‌వోలు, ఫైనాన్స్‌ డైరెక్టర్లు మొదలైనవారు) పాల్గొన్నారు. వీరిలో దాదాపు సగభాగం ఎగ్జిక్యూటివ్స్‌కి చెందిన సంస్థలు .. ఈసారి నియామకాలు గతేడాది కన్నా మరింత ఉధృతంగా చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నాయి.

వచ్చే అయిదేళ్లలో ఏడాదికి నలభై లక్షల ఉద్యోగాల కల్పన జరగవచ్చని యూబీఎస్‌ అంచనా వేస్తోంది. గత అయిదేళ్లలో ఇది ఏటా ఇరవై లక్షలుగా ఉంది. సర్వే ప్రకారం భవిష్యత్‌లో చేపట్టే నియామకాల్లో ఎక్కువగా తాత్కాలిక ఉద్యోగాలే ఉండనున్నాయి. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల సంస్థలు .. జీతభత్యాల పెంపు పది శాతం లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్‌ తెలిపింది. కొత్త ఆటోమేషన్‌ టెక్నాలజీలు ఇంకా హైరింగ్‌ ప్రణాళికలను దెబ్బతీసే స్థాయికి చేరలేదని పేర్కొంది.   
 

మరిన్ని వార్తలు