శాన్ఫ్రాన్సిస్కో: ఆన్లైన్లో చేసే ప్రతి కొనుగోలును జీమెయిల్ అకౌంట్ ద్వారా గూగుల్ ట్రాక్ చేస్తోంది. ఓ ప్రైవేట్ వెబ్ టూల్ ద్వారా వినియోగదారులకు ఈ సమాచారం అందుబాటులో ఉంచుతామని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే వ్యక్తిగత సమాచారాన్ని ప్రకటనల ట్రాకింగ్ కోసం వినియోగించట్లేదని తెలిపింది. వ్యక్తిగత ప్రకటనల కోసం జీమెయిల్ మెసేజ్ల నుంచి సమాచారాన్ని సేకరించడం ఆపివేసినట్లు గూగుల్ 2017లో ప్రకటించింది. కొనుగోళ్లు, బుకింగ్లను సులభంగా చూడటానికి, ట్రాక్ చేయడానికి ప్రైవేట్ వెబ్ టూల్ను సృష్టించినట్లు పేర్కొంది. అందులోని సమాచారాన్ని ఎప్పుడైనా తొలగించే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. మొబైల్ యాప్లోని హోమ్ పేజీలో యాడ్ల ప్రదర్శనకు అనుమతిస్తున్నట్లు మే 14న కంపెనీ ప్రకటించింది. ఇకపై గూగుల్ షాపింగ్ హోమ్ పేజీలో కూడా యాడ్లు ప్రదర్శిస్తామని, వాటి ఆధారంగా వినియోగదారులు తాము ఇష్టపడే బ్రాండ్లు వెతికి పట్టుకోవచ్చని తెలిపింది.