పాన్‌, ఆధార్‌ లింక్‌పై గుడ్‌న్యూస్‌

31 Aug, 2017 17:43 IST|Sakshi
పాన్‌, ఆధార్‌ లింక్‌పై గుడ్‌న్యూస్‌
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. పాన్‌ నెంబర్‌తో ఆధార్‌ను లింక్‌ చేసుకునే ప్రక్రియ గడువును మరో నాలుగు నెలల పాటు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. దీంతో పాన్‌తో, ఆధార్‌ను లింక్‌ చేసుకునే తుది గడువుగా డిసెంబర్‌ 31ను నిర్దేశించింది. పాన్‌తో ఆధార్‌ను జతచేయాలని ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి తుది గడువు కూడా నేటితోనే ముగియబోతుంది. ఆఖరి రోజున ఈ గడువును పెంచుతున్నట్టు ఆదాయపు పన్ను శాఖ చెప్పింది. పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోకపోతే, పన్ను రిటర్న్‌లు ఫైల్‌ చేసే ప్రక్రియ ముందుకు సాగదని ఆదాయపు పన్ను శాఖ అంతకముందు చెప్పింది.
 
2017 ఆగస్టు 5 వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఫైల్‌ చేసిన వారికి ఇది అతిపెద్ద ఊరటగా కనిపిస్తోంది. ఐటీఆర్‌ ఫైల్‌ చేసే తుదిగడువును ఆగస్టు 5 వరకు పొడిగించిన కేంద్రప్రత్యక్ష పన్ను బోర్డు, అదనంగా ఆ పన్ను చెల్లింపుదారులకు పాన్‌ను ఆధార్‌తో ఆగస్టు 31 వరకు లింక్‌ చేసుకోవాలని ఆదేశించింది. చాలామంది పన్ను చెల్లింపుదారులు, పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేసుకోకపోవడం వల్లే ఐటీఆర్‌ను ఫైల్‌ చేయలేకపోయారని తెలిసింది. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా ఆధార్‌ కార్డును అనుసంధానం చేసుకునే ప్రక్రియ గడువును డిసెంబర్‌ 31 వరకు పెంచాలని సుప్రీంకోర్టు నిన్ననే(బుధవారం) ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్ కె.కె.  వేణుగోపాల్ కూడా మరో మూడు నెలలపాటు ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు. 
మరిన్ని వార్తలు