న్యూఢిల్లీ : కోట్లకు కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లేదా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు చెక్కేస్తున్న నీరవ్ మోదీ, విజయ్మాల్యా లాంటి రుణ ఎగవేతదారులకు ప్రభుత్వం షాకిచ్చింది. ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేకంగా ''ది ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు'' ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లు త్వరలోనే పార్లమెంట్ ముందుకు రాబోతుంది. దీని ద్వారా విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను జప్తు చేసే అధికారం, అమ్మే అధికారం బ్యాంకులకు ప్రభుత్వం కల్పించింది.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్ల బ్యాంకుల్లో భారీగా కుంభకోణాలకు పాల్పడి, ఎలాంటి విచారణను ఎదుర్కోకోకుండా.. విదేశాలకు పారిపోయారు. ఇలాంటి వారిని టార్గెట్గా చేసుకుని ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. మార్చి 5 నుంచి ప్రారంభం కాబోతున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. రూ.100 కోట్లకు పైన బ్యాంకులకు రుణాలు ఎగ్గొటి, విదేశాలకు పారిపోయి, తిరిగి భారత్కు రాని వారికి ఈ బిల్లు అప్లయ్ అవనుంది. అన్ని బకాయిలను వెంటనే రికవరీ చేసుకునేలా ఈ బిల్లు సహకరించనుంది. విదేశాలకు పారిపోయినప్పటికీ, వారు ఏం దాచలేరని కచ్చితంగా ఇక్కడ అన్ని ఆస్తులను విక్రయించే అధికారం బ్యాంకులకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. గత సెప్టెంబర్లోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ డ్రాఫ్ట్ను ఆమోదించింది. పీఎన్బీ స్కాం నేపథ్యంలో ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే ఎవరు ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ :
సంబంధిత నేరం కింద ఏ వ్యక్తికైనా అరెస్ట్ వారెంట్ జారీ అయి, అతను క్రిమినల్ ప్రొసిక్యూషన్ తప్పించుకోవడానికి భారత్ను వీడి వెళ్లితే అతణ్ని ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా గుర్తిస్తారు. ఈ డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొన్న నేరాల్లో ఉద్దేశ్యపూర్వకంగా రుణాన్ని ఎగవేతదారులు, మోసం, ఫోర్జరీ, ఎలక్ట్రానిక్ రికార్డుల తప్పుడు డాక్యుమెంట్లు, సుంకాలు ఎగవేత, తిరిగి చెల్లించని డిపాజిట్లు ఉన్నాయి.