ఐటీఆర్‌ ఫైలింగ్‌ తుది గడువు పొడిగింపు

25 Sep, 2018 14:22 IST|Sakshi
ఐటీ రిటర్నుల ఫైలింగ్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును ప్రభుత్వం పొడిగించింది. 2017-18 సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్‌ ఫైలింగ్‌కు ఉన్న తుది గడువును సెప్టెంబర్‌ 30 నుంచి కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్‌ 15కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆడిట్‌ రిపోర్టు తుది గడువు కూడా అక్టోబర్‌ 15గానే నిర్ణయించింది. ఈ కొత్త మార్గదర్శకాలు, రూ.2 కోట్లకు పైన ఆదాయం ఆర్జించే వారికి, ఛార్టెడ్‌ అకౌంట్లు ఇంకా తమ అకౌంట్లను ఆడిట్‌ చేసే అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారులకు వర్తించనున్నాయి. 

అయితే పన్ను చెల్లించడానికి మాత్రం సెప్టెంబర్‌ 30నే తుది గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పలువురు స్టేక్‌హోల్డర్‌ ప్రతినిధుల అభ్యర్థన మేరకు, ఐటీఆర్‌లు, ఆడిట్‌ రిపోర్టుల తుది గడువును పెంచాం. కొన్ని కేటగిరీల పన్ను చెల్లింపుదారులకు ఈ తుది గడువు సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 15కు పెరిగింది’ అని సీబీడీటీ తెలిపింది. సీబీడీటీ తుది గడువును పెంచడం స్వాగతించాల్సిన విషయమని ట్యాక్స్‌ పార్టనర్‌ సమీర్‌ కనబార్‌ తెలిపారు. అంతకముందు 2017-18లో పన్ను చెల్లింపులు రికార్డు స్థాయిలో రూ.10.03 లక్షల కోట్లకు పెరిగినట్టు సీబీడీటీ తెలిపింది.  

మరిన్ని వార్తలు