టెల్కోలకు భారీ ఊరట లభించనుందా? 

30 Oct, 2019 09:49 IST|Sakshi

టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం 

కేంద్రం సెక్రటరీల కమిటీ (సీఓఎస్‌)ని ఏర్పాటు 

టెలికంకు భారీ బెయిలవుట్‌ ప్యాకేజీ? 

సాక్షి,  న్యూఢిల్లీ:  టెల్కోల నుంచి భారీగా రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి సుప్రీంకోర్డు డాట్‌ (టెలకమ్యూనిషన్ల శాఖ)కు అనుమతించిన నేపథ్యంలో- ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడానికి కేంద్రం మంగళవారం ఒక సెక్రటరీల కమిటీ (సీఓఎస్‌)ని ఏర్పాటు చేసింది. సుప్రీం రూలింగ్‌ నేపథ్యంలో-  టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం ఉందన్నజారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. టెలికంకు భారీ బెయిలవుట్‌ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపుతోందని, ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ దృష్టి సారిస్తుందని వార్తలు వస్తున్నాయి. కమిటీకి క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వం వహిస్తారు. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియాల వంటి సర్వీస్‌ ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న ‘‘ఆర్థిక ఒత్తిడి’’ని ‘‘అన్ని కోణాల్లో’’ పరిశీలించి,  తీవ్రతను తగ్గించడానికి సూచనలు ఇవ్వడానికి కమిటీ ఏర్పాటయినట్లు టెలికం వర్గాలు తెలిపాయి.  ఆర్థిక, న్యాయ, టెలికం కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ త్వరలో సమావేశమై, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తన సిఫారసులను కేంద్రానికి సమర్పిస్తుందని సమాచారం. 

ప్యాకేజ్‌లో ఏముంటాయ్‌?
స్పెక్ర్టమ్‌ చార్జీల తగ్గింపు
ఉచిత మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌కు ముగింపు
చౌక డేటా టారిఫ్‌లకు సెలవు చెప్పడం
నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా 2020-21, 2021-22కు సంబంధించి స్పెక్ర్టమ్‌ వేలం చెల్లింపుల వాయిదా వేయడం. 
యూఎస్‌ఓఎఫ్‌ (యూనివర్షల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌) చార్జ్‌ని 3 శాతానికి తగ్గించడం. 
నేపథ్యం ఇదీ...
కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్‌ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. 

చదవండి :  టెలికంలో భారీగా ఉద్యోగాల కోత

మరిన్ని వార్తలు