గుడ్‌న్యూస్‌ : పొదుపు ఖాతాలపై పెరిగిన వడ్డీ రేట్లు

20 Sep, 2018 14:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నతరహా పొదుపు ఖాతాల్లో మదుపు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. జాతీయ పొదుపు సర్టిఫికెట్‌, పీపీఎఫ్‌ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి 0.4 శాతం మేర పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్లపై పెరిగిన వడ్డీరేట్లకు అనుగుణంగా పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను సర్కార్‌ సవరించింది. చిన్నతరహా పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రతి త్రైమాసికంలో నోటిఫై చేస్తారు.

2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సవరించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వడ్డీ రేట్ల సవరణతో అయిదేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై వడ్డీరేటును 7.8 శాతానికి, సీనియర్‌ సిటిజెన్‌ పొదుపు పథకంపై వడ్డీరేటును 8.7 శాతానికి, రికరింగ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.3 శాతానికి పెరిగాయి. 4 శాతంగా ఉన్న సేవింగ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును యథాతథంగా ఉంచారు.

ఇక ప్రస్తుతం పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీపై 7.6 శాతం ఉన్న వడ్డీరేటు 8 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి ఖాతాలపై 0.4 శాతం వడ్డీరేటు అధికమై 8.5కు చేరింది. ఒకటి నుంచి మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటును 0.3 శాతం పెంచారు.

మరిన్ని వార్తలు