సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్ సక్సెస్

6 Dec, 2014 00:26 IST|Sakshi
సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్ సక్సెస్

ప్రభుత్వ ఖజానాకు రూ. 1,715 కోట్లు

న్యూఢిల్లీ: స్టీల్ రంగ దిగ్గజం సెయిల్ వాటా విక్రయానికి ఇన్వెస్టర్ల నుంచి రెట్టింపు స్పందన లభించింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం 20.65 కోట్ల షేర్లను(5% వాటా) అమ్మకానికి పెట్టగా, మొత్తం 42.93 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖల య్యాయి. ఆఫర్‌కు నిర్ణయించిన రూ. 83 ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 1,715 కోట్లు లభిం చనున్నాయి. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 75%కు పరిమితం కానుంది. తద్వారా సెబీ లిస్టింగ్ నిబంధనలు అమలు కానున్నాయి.

ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో నిర్వహించిన ఇష్యూలో భాగంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 5% డిస్కౌంట్ ధరకు సెయిల్ షేర్లు జారీకానున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, ఈ విభాగం నుంచి ఇష్యూకి 2.66 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇక సాధారణ విభాగంలో 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖల య్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందుకు వీలుగా ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ తదితరాలలో సైతం వాటాల విక్రయాన్ని చేపట్టనుంది. కాగా, బీఎస్‌ఈలో సెయిల్ షేరు 3 శాతం క్షీణించి రూ.83 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు