ఇక ఉడాన్‌ ఇంటర్నేషనల్‌

9 Mar, 2018 18:18 IST|Sakshi
పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ నయన్‌ చౌబే

సాక్షి, హైదరాబాద్: చౌక ధరకే విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ఉడాన్‌ పథకం దేశీయంగా విజయవంతం కావడంతో దీన్ని అంతర్జాతీయ సేవలకు కూడా విస్తరించ నున్నామని   పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ నయన్‌ చౌబే తెలిపారు.  అంతర్జాతీయ మార్కెట్‌లో  భగ్గుమంటున్న ముడి చమురు ధర పరిశ్రమను దెబ్బతీసిందన్నారు. దీంతో   గత మూడేళ్ల కాలంలో భారత్‌లో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 20 శాతం చొప్పున పెరుగుతున్నాఈ ఏడాది వృద్ధి 17.5 శాతానికి పరిమితం కానుందన్నారు. ముడి చమురు బ్యారెల్ ఇంధన ధర 80 డాలర్ల కంటే తక్కువగా ఉంటే వచ్చే 20 ఏళ్లలో యేటా విమానయాన రంగం 15 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక‍్తం చేశారు.  హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా 2018' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన  గ్లోబల్ గా మూడవ అతిపెద్ద ఏవియేషన్  హబ్ గా ఇండియా ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న ఇంధన ఛార్జీల వల్ల విమానయాన కంపెనీలు భారంగా ఉన్నప్పటికీ..టికెట్ల ధరలు తగ్గిస్తేనే సమాన్యుని విమాన ప్రయాణ కల నెరవేరుతుందన్నారు.

ప్రాంతీయంగా విమాన సేవలు అందించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీంలో గత రెండేళ్లలో 56 నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియాలో 395 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండగా. ప్రస్తుతం  వీటి సంఖ్య 900 ఎయిర్ క్రాఫ్ట్స్ చేరుకుందని చెప్పారు.  స్వాతంత్ర్యం వచ్చాక అరవయేళ్ళలో 75 ఎయిర్ పోర్టులు డెవలప్ చేశాం..ప్రతీ ప్రధాన  పట్టణానికి ఎయిర్ కనెక్టివిటీ ఉంది..ఉడాన్ పథకం ద్వారా 51 ఎయిర్ పోర్టులను డెవలప్ చేస్తున్నాం..అందులో ఇప్పటికే 18 ఎయిర్ పోర్టులు తమ ఆపరేషన్స్  ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు చేయడం వల్ల వచ్చే 6-8 నెలల్లో మరిన్ని విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చే వీలు ఉందున్నారు. వచ్చే నాలుగేళ్లలో వంద పట్టణాలను కనెక్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.వచ్చే నాలుగేళ్లలో వ్యాపారాన్ని భారీగా విస్తరించేందుకు, విమానాశ్రయాలను ఆధునీకీకరణకు రూ.18వేల కోట్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు చౌబే ప్రకటించారు. అలాగే ఎయిర్‌పోర్ట్‌ అఫ్ ఇండియాయాక్ట్ (ఏఏఐ)లో మార్పులు తెస్తామని చౌబే ప్రకటించారు. ఏఏఐ సవరణ బిల్లుపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతున్న  నేపథ్యంలో ఈ  బిల్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోగానీ, ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఉడాన్ ఇంటర్నేషనల్‌ పథకంలో అంతర్జాతీయ రూట్లలో సేవలు అందించడానికి తాము మార్గనిర్దేశనం, బిడ్డింగ్‌ వ్యవహారాలు మాత్రమే చేయనున్నామని, అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చు కోవాలన్నారు.  ఇప్పటికే దీనిపై అసోం ప్రభుత్వం ఆసక్తిని చూపినట్టు తెలిపారు.  దాదాపు మూడేళ్లపాటు 100కోట్ల రూపాయల పెట్టుబడులకు  ముందుకువచ్చినట్టు  చౌబే వివరించారు.   మిగతా రాష్ట్రాలు ఇంకా  స్పందించాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు