జీపీఎఫ్‌ వడ్డీరేటు 0.4 శాతం పెంపు

17 Oct, 2018 00:03 IST|Sakshi

న్యూఢిల్లీ: జనరల్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌), సంబంధిత ఇతర స్కీమ్‌ల వడ్డీరేటును అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) రేటుకు అనుగుణంగా ఈ రేట్లలో మార్పు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ పెంపు నిర్ణయంతో జీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం (జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో) నుంచి 8 శాతానికి ఎగసింది. ప్రావిడెంట్‌ ఫండ్స్‌పై వడ్డీరేటు పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేలు, డిఫెన్స్‌ దళాలకు వర్తిస్తుంది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికానికి ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌సహా పొదుపు పథకాలపై వడ్డీరేటును గత నెల్లో ప్రభుత్వం 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్‌ రేట్లకు అనుగుణంగా ఈ రేట్లు పెరిగాయి.

మరిన్ని వార్తలు