రికార్డు స్థాయికి జీఎస్‌టీ వసూళ్లు 

2 May, 2019 00:17 IST|Sakshi

తొలిసారిగా రూ.1.13 లక్షల కోట్లు 

ఏప్రిల్‌ నెల గణాంకాలు విడుదల 

న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరం  తొలి నెల... ఏప్రిల్‌లో రూ.1,13,865 కోట్ల  వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ   తెలియజేసింది. 2017 జూలై 1న జీఎస్‌టీ అమల్లోకివచ్చాక ఇది ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి. 2018 ఏప్రిల్‌ నెలలో ఉన్న రూ.1,03,459 కోట్లతో పోలిస్తే పన్నుల ఆదాయం 10 శాతం అధికంగా వసూలైంది. పన్నుల ఎగవేత నిరోధానికి అధికారులు తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చినట్టు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మార్చి నెలకు సంబంధించి మొత్తం సమ్మరీ సేల్స్‌ రిటర్న్‌లు ‘జీఎస్‌టీఆర్‌ 3బి’ ఏప్రిల్‌ 30 వరకు 72.13 లక్షలు దాఖలయ్యాయి. జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు మించి వసూలు కావడం వరుసగా రెండో నెల. మార్చి నెలలో రూ.1.06 లక్షల కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. ‘‘2019 ఏప్రిల్‌లో రెగ్యులర్, ప్రొవిజనల్‌ సెటిల్‌మెంట్‌ అనంతరం సెంట్రల్‌ జీఎస్‌టీకి (సీజీఎస్‌టీ) రూ.47,533 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ(ఎస్‌జీఎస్‌టీ)కి రూ.50,776 కోట్లు వచ్చినట్టు ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. రూ.12,000 కోట్ల ఐజీఎస్‌టీ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమానంగా పంచినట్టు తెలిపిం ది. గత నెలకు సంబంధించిన పన్నుల వసూళ్ల గణాంకాలను మరుసటి నెల మొదటి రోజున కేంద్రం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.  

పన్నులు పెరిగేందుకు పలు కారణాలు 
జీఎస్టీ వసూళ్లు పెరగడానికి ఎన్నో కారణాలను ట్యాక్స్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈవే బిల్లుల యంత్రాంగం ద్వారా పన్ను నిబంధనలను పాటించేలా కఠినతరం చేయడం, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పన్నులను మార్చడం వల్ల పలు కంపెనీలు అర్హత లేకపోవడంతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను తిరిగి వెనక్కి ఇచ్చేయడం, సాధారణ ఎన్నికల ముందు ప్రభుత్వం ఎక్కువగా నిధులు ఖర్చు చేయడాన్ని కారణాలుగా ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు