లక్షకోట్లు దాటేసిన జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ చట్టం వచ్చాక తొలిసారి ఈ స్థాయి వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రూ.1.06లక్షల కోట్లకు వసూళ్లు సాధించినట్టు కేంద్ర గణాంకాల శాఖ సోమవారం వెల్లడించింది. మంత్ ఆన్ మంత్ 9.5 శాతంవృద్ధిని సాధించింది. జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఇంత భారీగా వసూలు కావడం విశేషం. గత నెలలో జీఎస్టీ వసూళ్లుగా రూ.97,247 కోట్లుగా నిలిచాయి. ఈ సారి రిటర్నులు పెరగడంతో ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. ఉత్పత్తి, వినియోగంలో పురోగతిని ఇది సూచిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
సెంట్రల్ జీఎస్టీ రూ. 20,353 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.27,520 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్ రూ.50,418 కోట్లు, సెస్సు రూపంలో రూ.8,286 కోట్లు మార్చినెలలో వసూలైనాయి. మార్చి 31 వరకు జీఎస్టీఆర్ -3బీను ఫైల్ చేసిన వారి సంఖ్య 75.95లక్షలుగా నిలిచింది. గత మార్చితో పోల్చుకుంటే దాదాపు 15.6శాతం వృద్ధి కనిపించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సగటు నెల వసూళ్లు రూ.98,114కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది కంటే 9.2శాతం ఎక్కువ. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11.47లక్షల కోట్లు వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించగా తొలుత దీనిని రూ.13.71లక్షల కోట్లుగా నిర్ణయించి ఆ తర్వాత తగ్గించిన సంగతి తెలిసిందే.
The record collection in March, 2019 of the GST touching ₹1,06,577 crore indicates the expansion in both manufacturing and consumption.
— Chowkidar Arun Jaitley (@arunjaitley) April 1, 2019